Friday, April 26, 2024

ఇరాన్‌తో ఒకలా, రష్యాతో మరోలా!

- Advertisement -
- Advertisement -

US President Joe Biden comments on india

ఉక్రెయిన్ వివాదం లో మన దేశం తటస్ధ వైఖరి తీసుకుంటుందని అమెరికా కలలో కూడా ఊహించి ఉండదు. అందుకే బైడెన్‌కు మన మీద కోపం వచ్చింది. మాట్లాడటం మాని బెదిరింపులు, బుజ్జగింపులకు తెర తీశాడు. మార్చి 18వ తేదీన అమెరికా, చైనా అధిపతులు జో బైడెన్, జీ జిన్‌పింగ్ వీడియో కాన్ఫరెన్సు ద్వారా చర్చలు జరిపారు. ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న సైనికచర్య మీద మనమూ, చైనా భద్రతా మండలిలో తటస్ధ వైఖరినే ప్రకటించాయి. అమెరికా మన సహజ భాగస్వామి, ఒకటే మాట, ఒకటే బాట లేదా ఒకటే మంచం ఒకటే కంచం అన్నట్లుగా రోజురోజుకూ మరింత సన్నిహితం అవుతున్నట్లు చెబుతున్నారు. అలాంటపుడు అమెరికా నేత బైడెన్ మన ప్రధాని మోడీతో మాట్లాడకుండా జీ జిన్‌పింగ్‌తో చర్చించటం ఏమిటి? విశ్వగురువుగా విశ్వరూపం ప్రదర్శించే అవకాశాన్ని మోడీ చేజేతులా పోగొట్టుకున్నారా? లేక మనకు అంతసీన్ లేదా? మన బలం గురించి అతిగా అంచనా వేసుకున్నామా? ఇవన్నీ కాస్త ఆలోచించే వారిలో ఎవరికైనా తలెత్తే ప్రశ్నలు. కాదంటారా?
ఉక్రెయిన్ వివాదంలో జో బైడెన్‌కు చైనా నేత జిన్‌పింగ్ స్పష్టం చేసిందేమిటి? మీ బెదిరింపులకు ఎవరూ భయపడరు.

వివాద పరిష్కారానికి అమెరికా, నాటో కూటమి రష్యాతో చర్చలు జరపాలి. రష్యా సైనిక చర్య పేరుతో దానిపై విచక్షణా రహితంగా ఆంక్షలను ప్రకటించటాన్ని చైనా వ్యతిరేకిస్తుంది. ఈ వివాదాన్ని మేం కోరుకోవటం లేదు. యుద్ధరంగంలో చేతులు కలుపుకోవటాన్ని చూడకూడదనుకున్నాం. వివాదం, ఘర్షణ ఎవరికీ ప్రయోజనకరం కాదు అని కుండబద్దలు కొట్టారు. మరి మన దేశం అలాంటి స్పష్టమైన వైఖరిని ఎందుకు తీసుకోవటం లేదు అన్నది ప్రశ్న. మన, చైనా తటస్ధ వైఖరుల్లో ఉన్న తేడా ఇదే. ఆంక్షలను వ్యతిరేకించి రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న చైనా మీద, అదే రష్యానుంచి కొనుగోలు చేస్తున్న మన మీద అమెరికా వైఖరిలో కూడా తేడా ఉంది. చైనా మీద ప్రతీకార చర్యలుంటాయని బహిరంగంగానే అమెరికా బెదిరించింది. దానిపై దాడికి అనేక దేశాలను సమీకరిస్తున్న అమెరికాకు మన అవసరం గనుక రష్యా నుంచి చమురు కొనుగోలు చేసినా, ఎస్ 400 క్షిపణులను కొనుగోలు చేసినా మింగాకక్కలేకుండా ఉంది. తెర వెనుక బెదిరింపులకు దిగుతోంది.

అమెరికాతో బంధం కారణంగా అనేక దేశాలకు మనం దూరమయ్యాం. అందువలన తనకు తాన తందాన అనకుండా ఎలా ఉంటుందనే భరోసాతో ఉంది. చైనాకు వ్యతిరేకంగా చతుష్టయ (క్వాడ్) కూటమిలోకి మనలను లాగి రెండు దేశాల మధ్య గతంలో ఎన్నడూ లేని విధంగా పరస్పర అనుమానాలు తలెత్తేట్లు అమెరికా చేసింది. మన సరిహద్దుల్లో కదలికలను కూడా అది ఇచ్చిన సమాచారం మీద ఆధారపడేట్లు చేసుకుంది. ఇంత చేస్తే మమ్మల్ని అనుసరించరా అంటూ బైడెన్‌కు మన మీద కోపం వచ్చింది. మాట్లాడటం మాని బెదిరింపులు, బుజ్జగింపులకు తెరతీశాడు. చమురు కొనుగోలు గురించి బైడెన్ మీడియా కార్యదర్శి జెన్ సాకీ చెప్పిందేమిటి? చమురు కొనుగోలును మా ఆంక్షలను ఉల్లంఘించినట్లు భావించటం లేదు గానీ వర్తమాన పరిణామాల గురించి చరిత్రను లిఖించినపుడు మీరెక్కడ ఉంటారో కూడా ఆలోచించుకోవాలి.

రష్యన్ నాయకత్వానికి మద్దతు ఇవ్వ టం అంటే (చమురు, ఇతర కొనుగోళ్ల ద్వారా అనిఅర్ధం) దురాక్రమణకు మద్దతు ఇచ్చినట్లే, అది సహజంగానే వినాశకర ప్రభావాన్ని కలిగిస్తుందని సాకీ హెచ్చరించారు. ఒక స్వతంత్ర, సర్వసత్తాక దేశానికి ఇటువంటి బెదిరింపులు వచ్చినపుడు కూడా మోడీ నోరు విప్పకపోతే ఏమనాలి. దేశాన్ని సురక్షితంగా ఉంచుతారని మోడీ చేతుల్లో పెట్టిన జనానికి విశ్వాసం ఎలా ఉంటుంది. యుద్ధం చేయమని అడగటం లేదుగా ఇలాంటి బెదిరింపులు తగవని మోడీగాక పోతే ఎవరు చెప్పాలి? ఇలాంటి బలహీనత లేదా పిరికిబారిన వారు విశ్వగురువులు, ప్రపంచ నేతలు ఎలా అవుతారు ? ఇక బుజ్జగింపుల గురించి చెప్పాల్సి వస్తే మార్చి 19వ తేదీన ఢిల్లీ పర్యటనను జపాన్ ప్రధాని కిషిదా 15వ తేదీన ఖరారు చేసుకొని రావటం వెనుక అమెరికా హస్తం లేదా? ఇరు దేశాల వార్షిక సమావేశాలు ఉన్నప్పటికీ వాటికి కిషిదా వస్తాడని ముందుగా ఎలాంటి ప్రకటనలు లేవు. సహజంగా ఇలాంటి రాకపోకలు ఎంతో ముందుగానే ఖరారవుతాయి.

మన దేశంలో 42 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెడతామంటూ మనకు కిషిదా ఒక బిస్కెట్ వేశాడు.ఐరాసలో తటస్ధంగా ఉన్న మన దేశం దానికి కట్టుబడి ఉందా అంటే లేదు. ప్రపంచ కోర్టులో రష్యాకు వ్యతిరేకంగా మన దేశం నుంచి ఎన్నికైన జడ్జి దల్వీర్ బండారి అమెరికా కూటమి దేశాల వారితో కలసి ఓటు వేశారు. ఇది అమెరికాను సంతుష్టీకరించేదిగా లేదా? 2017లో రెండవ సారి దల్వీర్ ఎన్నిక నరేంద్ర మోడీ సర్కార్ దౌత్యవిజయానికి ప్రతీక అని అప్పుడు చెప్పారు. మరి ఇప్పుడు ఇదేమిటి అంటే దల్వీర్ వ్యక్తిగత హోదాలో తన వాంఛను బట్టి ఓటు వేశారని విదేశాంగ శాఖ ఇచ్చిన వివరణ రష్యాను సంతృప్తి పరుస్తుందా? దేశ విధానాన్ని బట్టి నడుచుకోవాలా వ్యక్తిగత ఇష్టాఅయిష్టాల ప్రకారమా? దీని ద్వారా మన దేశం ఏమి సందేశం పంపినట్లు?తైవాన్ సమస్య మీద కూడా జిన్‌పింగ్ అమెరికాకు గట్టి హెచ్చరిక చేశాడు. తైవాన్ అంశం మీద నిప్పుతో చెలగాటాన్ని కొనసాగించినా, చైనా ముఖ్య ప్రయోజనాలను ఉల్లంఘించినా రెండు దేశాల మధ్య స్నేహ లేదా సానుకూల మాటలు ఉండవని కూడా స్పష్టం చేశాడు. మనకు అమెరికాతో అలాంటి పరిస్ధితి లేదు కనుక రష్యా అంశంలో మా ప్రయోజనాలను గమనంలో ఉంచుకొని తెగేదాకా లాగవద్దని ఎందుకు చెప్పకూడదు? బైడెన్, జిన్‌పింగ్ భేటీ తరువాత కొందరు మీడియా వ్యాఖ్యతలు అమెరికా దిక్కుతోచని స్ధితిలో ఉందని రాశారు. “పుతిన్ వ్యవహారంలో చైనా సాయం కొరకు చూస్తున్న బైడెన్‌” అన్న శీర్షికతో బ్లూవ్‌ు బెర్గ్ రాసింది.

రష్యా చేసిన దానికి అమెరికా, దాని ఐరోపా మిత్రులు పెను ముప్పును ఎదుర్కోవలసి రావచ్చని దానిలో పేర్కొన్నారు. చైనా తిరుగుబాటు రాష్ర్టమైన తైవాన్ వేర్పాటును అమెరికా కోరుతున్న సంగతి పదేపదే చెప్పనవసరం లేదు. అలాంటిది జీ జిన్‌పింగ్‌తో భేటీలో బైడెన్ చెప్పిందేమిటి? “చైనాలోని వ్యవస్ధను మార్చేందుకు లేదా చైనాకు వ్యతిరేకంగా కూటమికి తిరిగి ప్రాణ ప్రతిష్ట చేసేందుకు, చైనాతో కొత్త ప్రచ్ఛన్న యుద్ధాన్ని కోరుకోవటం లేదు. తైవాన్ స్వాతంత్య్రాన్ని సమర్ధించటం లేదు, చైనాతో ఘర్షణను కోరుకోవటం లేదు” అని బైడెన్ చెప్పిన అంశాన్ని జీ జిన్‌పింగ్ ముఖ్య అంశంగా పరిగణించినట్లు చెప్పారు. ప్రాణ, విత్త, మాన భంగములందు ఆడితప్పవచ్చని పెద్దలు సెలవిచ్చారు కదా! అందుకే అమెరికా దానికి కట్టుబడి ఉంటుందా అన్నది ప్రశ్న.

ఉక్రెయిన్ వివాద నేపధ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేయటాన్ని సమర్ధించేందుకు మన అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దింపాం తప్ప రాజకీయ నాయకత్వం ఎందుకు నోరు మెదపటం లేదు. పాకిస్తాన్, చైనాల విషయంలో అలా లేరే, సూటిగా కాకున్నా బహిరంగంగా, పరోక్షంగానైనా హెచ్చరికలు చేశారు కదా? అమెరికా, నాటో కూటమిపట్ల అంత అణకువ ఎందుకు? అమ్మా నీకు తోటకూరను దొంగతనంగా తెచ్చి ఇచ్చినపుడే తప్పని చెప్పి ఉంటే ఇప్పుడు నాకీ దుస్ధితి తప్పేది కదా అని జైలు పాలైన కొడుకు అన్న కథ తెలిసిందే. ఇక్కడ దొంగతనం కాదు గానీ అమెరికా, పశ్చిమ దేశాల వత్తిడికి గతంలో లొంగిపోకుండా గట్టిగా ఉండి ఉంటే ఇప్పుడు చివరికి జో బైడెన్ మీడియా అధికారికి అంత సాహసం ఉండేదా ? గతంలో ఇరాన్‌పై ఆంక్షలు విధించింది అమెరికా. ఇప్పుడు రష్యా నుంచి కొనుగోలులో తగ్గేదేలే అన్న మాదిరిగా ఆనాడు నరేంద్ర మోడీ సర్కార్ ఎందుకు చెప్పలేకపోయింది? ఇరాన్ ఎవరి మీదా దాడులకు దిగలేదే ! మన మాదిరే తన రక్షణ కోసం అణు కార్యక్రమం చేపట్టింది తప్ప మరొకటి కాదు. ఆంక్షలతో నిమిత్తం లేకుండానే ఎంతో కాలంగా మనతో ఉన్న సంబంధాల కారణంగా మన రూపాయలు తీసుకొనేందుకు, చెల్లింపు గడువు ఎక్కువ ఇచ్చేందుకు కూడా వెసులుబాటు కల్పించినా మన సర్కార్ ఇరాన్ నుంచి చమురు కొనుగోలును ఎందుకు నిలిపివేసింది? మనసుంటే మార్గం దొరికేది కాదా? ఇదే మాదిరి వెనిజులా నుంచి కూడా నిలిపివేశాము.

గతంలో ఎన్నడూ లేనిది అమెరికా నుంచి కొనుగోళ్లకు మరలాం. ఒకసారి మన బహీనత తెలిసిన తరువాత ప్రతివారూ బెదిరిస్తారు. తమ వ్యూహాత్మక ఉద్దేశాల మీద తప్పుడు అంచనాలకు వచ్చారని జీ జిన్‌పింగ్ చెప్పినట్లుగా రష్యాతో తమ సంబంధాలను తక్కువ అంచనా వేశారని అమెరికన్లకు మోడీ ఎందుకు చెప్పలేకపోతున్నారు? అమెరికాను నమ్ముకుంటే ఐరోపాలో ఉక్రెయిన్‌కు ఏమైం దో చూస్తున్నాము. తన లబ్ధి కోసం ఎవరినైనా బలిపెట్టేందుకు అది సిద్ధ్దం. ఇప్పటికైనా మించి పోయింది లేదు, మన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని రూపొందించుకోవటం అవసరం. దీనిలో రాజకీయాలు కాదు, దేశ గౌరవ, ప్రతిష్ట, ప్రయోజనాలు ముఖ్యం. ఎవరు అంగీకరించినా, లేకున్నా విమర్శించినా, అభిమానించినా ప్రధానిగా నరేంద్ర మోడీ వాటి కోసం తగిన విధంగా వ్యవహరించకపోతే చరిత్రలో విమర్శలకు గురవుతారు.

ఎం కోటేశ్వరరావు- 8331013288

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News