కొవిడ్ ప్రయాణ నిషేధం ఎత్తివేసే అవకాశం
వాషింగ్టన్ : నవంబర్ నుంచి అన్ని రకాల ప్రయాణ ఆంక్షలను తొలిగించే వీలుందని అమెరికా అధికారికంగా సోమవారం తెలిపింది. ప్రపంచవ్యాప్త బెడద కోవిడ్తో పలు దేశాలు విదేశీయుల రాకలపై ఆంక్షలు విధించాయి. కరోనా వైరస్ ఉధృతి క్రమంలో ఆరంభం అయిన ఈ ఆంక్షలు అమెరికా గత 18 నెలలుగా అమలు చేస్తూ వస్తోంది. అయితే ఇప్పటి వైరస్ పరిస్థితి, వ్యాక్సిన్ల అందుబాటు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని కోవిడ్ ట్రావెల్ బ్యాన్ను నవంబర్ నుంచి ఎత్తివేసేందుకు సిద్ధం అయినట్లు జెఫ్రీ జియింట్స్ తెలిపారు. ప్రెసిడెంట్ జో బైడెన్ ఏర్పాటు చేసిన కరోనా వైరస్ కట్టడి బృందం సమన్వయకర్తగా జెఫ్రీ వ్యవహరిస్తున్నారు. పూర్తి స్థాయిలో టీకాలు పొంది ఉండాలి. ఇదే దశలో ప్రయాణాలకు ముందు సంబంధిత పరీక్షలు నిర్వహించుకుని ఉండాలి. వ్యాప్తి లక్షణాలు లేకుండా ఉండాలి. అటువంటి వారందరికీ అమెరికాకు వచ్చేందుకు వీలుంటుంది. నవంబర్ ఆరంభం నుంచి ఈ ప్రక్రియ ఆరంభం అవుతుందని వివరించారు.
భారత్ ఇతర దేశాల నుంచి అత్యధిక సంఖ్యలో ప్రజలు అమెరికా పర్యటనలు తలపెట్టుకుని ఉన్నారు. అయితే అత్యవసర ప్రాతిపదికన ఉన్న విమాన ప్రయాణాలకు తప్ప సాధారణ ప్రయాణాలకు అనుమతి లేకుండా ఏడాదిన్నరగా ఎదురుచూస్తున్నారు. ఇంకా నెల రోజుల సమయం ఉంది. అప్పటికి పరిస్థితిని పూర్తిగా పర్యవేక్షించుకుని ప్రయాణ ఆంక్షల ఎత్తివేత విషయంలో స్థిరమైన నిర్ణయానికి వస్తామని బైడెన్ ప్రతినిధి తెలిపారు. ట్రంప్ దశలో అమెరికాలో తలెత్తిన ఉదృత స్థాయి కరోనాతో అమెరికాకు ఇతర దేశాలకు దాదాపుగా ప్రయాణ సంబంధాల అంతరం ఏర్పడింది. క్రమేపీ పరిస్థితులు అనుకూలించడం, యూరోపియన్ యూనియన్ దేశాలు, భారత్ , జపాన్ వంటి మిత్రభాగస్వామ్యపక్షాల నుంచి వచ్చిన డిమాండ్లకు అనుగుణంగా బైడెన్ ప్రయాణాల వీలుకు నిర్ణయం తీసుకున్నట్లు, ఈ ఆంక్షల ఎత్తివేతకు రంగం సిద్ధం చేసేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేసుకుంటున్నట్లు వెల్లడైంది.