Thursday, April 25, 2024

3న కేబినెట్ భేటీ

- Advertisement -
- Advertisement -

Telangana State Cabinet meeting on sept 3rd

ప్రగతి భవన్‌లో మధ్యాహ్నం
3గంటలకు సమావేశం

మన తెలంగాణ/హైదరాబాద్ : వచ్చే నెల 3వ తేదీన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ప్రగతి భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో శాసనసభ సమావేశాల నిర్వహణపై చర్చించి తగు నిర్ణయం తీసుకుంటారు. గత బడ్జెట్ సమావేశాలు మార్చి 15న ముగిశాయి. దీంతో నిబంధనల ప్రకారం సెప్టెంబర్ 14వ తేదీలోపు సభ మళ్లీ సమావేశం కావా ల్సి ఉంది. ఈ నేపథ్యంలో శాసనసభ సమావేశాల నిర్వహణపై కేబినెట్‌లో చర్చించి తేదీలు ఖరారు చేస్తారు. వీటితో పాటు ఇతర పాలనాపరమైన అంశాలపైనా మంత్రివర్గంలో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. అలాగే జాతీయ రాజకీయాలపై కూడా మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉందని ప్రధానంగా వినిపిస్తోంది. ఇటీవల 24 రాష్ట్రాల నుంచి వచ్చిన సుమారు 100 మంది రైతు కార్మిక సంఘాల నేతలు కూడా కెసిఆర్‌ను జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిన ఆహ్వానించిన విషయం తెలిసిందే. దీనిపై కూడా మంత్రివర్గ సహచరులతో కెసిఆర్ చర్చించనున్నారు.

రైతు సంఘాల నేతలతో జరిగిన సమావేశం తీరుతెన్నులు, వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను కూడా మంత్రివర్గ సమావేశంలో ప్రధాన ఎజెండాగా చర్చించనున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అలాగే రాష్ట్ర ఆదాయ వనరుల సమీకరణపై కూడా ప్రధాన చర్చ జరుగనుందని సమచారం. రుణ సమీకరణలో కేంద్రం సహాయనిరాకరణ, రాష్ట్ర పట్ల వివక్షపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. కేంద్రం నుంచి రావాల్సి నిధులు రాని కారణంగా రాష్ట్ర ఖజానాపై పెద్దఎత్తున ఆర్ధిక భారం పడుతోంది. ఫలితంగా ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలోనే రూ.45 వేల కోట్లు లోటు ఏర్పడనుండడంతో దీనిని పూడ్చుకునేందుకు చేపట్టాల్సిన అంశాలపై కూడా రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారని అధికార వర్గాల్లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో నిరుపయోగంగా ఉన్న భూముల అమ్మకం, పన్నేతర ఆదాయం పెంచుకునే విధంగా ఆలోచనలు చేసిన ప్రభుత్వం.. మరిన్ని ఆదాయ మార్గాలను అన్వేషించే అంశాలపై కూడా చర్చించనున్నారని తెలుస్తోంది. ఇక త్వరలో జరగనున్న మునుగోడు ఉపఎన్నికపై కూడా చర్చించనున్నారని తెలుస్తోంది.

అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, నిధుల విడుదల తదితర అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారని తెలుస్తోంది. గత మంత్రివర్గ సమావేశంలో గ్రామకంఠ భూములపై పదిహేను రోజుల్లోగా నివేదికను రూపొందించాలని మంత్రివర్గ సమావేశం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నివేదికపై సంబంధిత అధికారులు మంత్రివర్గ సమావేశంలో ఉంచనున్నారు. దీనిపై కూడా సమగ్రంగా చర్చించి మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News