శ్రీహర్ష, ప్రియా శ్రీనివాస్, రఘు.జి.కవిత శ్రీరంగం, ఆర్యన్ గౌర, రేఖా ఇందుకూరి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వధుకట్నం’. షబాబు ఫిలిమ్స్ పతాకంపై భార్గవ గొట్టిముక్కల దర్శకత్వంలో షేక్బాబు సాహెబ్ నిర్మించిన సందేశాత్మక హాస్యరస కుటుంబ కథా చిత్రమిది. ఈ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్లోని ప్రొడ్యూసర్ కౌన్సిల్లో జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు భార్గవ గొట్టిముక్కల మాట్లాడుతూ “ప్రస్తుతం సమాజంలో మహిళలు ఎన్నో రంగాలలో పురుషులతో సమానంగా రాణిస్తున్నా ఇంకా మహిళల పట్ల వివక్ష కొనసాగుతోంది. స్కానింగ్లో ఆడ శిశువు అని తెలుసుకొని అబార్షన్స్ చేయించడం వల్ల ఆడ పిల్లల శాతం తగ్గుతోంది. దీంతో ఆడ పిల్లలే దొరక్క పోతే వధు కట్నం ఇచ్చే రోజులు వస్తాయని చెబుతూ సందేశాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించాము”అని అన్నారు. నిర్మాత షేక్ బాబుసాహెబ్ మాట్లాడుతూ ఈ చిత్రాన్ని ఈనెల 31న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.