భద్రాచలం: వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాల్లో భాగంగా ఆదివారం భద్రాద్రిరాముడు భక్తులకు పరశురామావతారంలో దర్శనమిచ్చారు. ఈ అవతారాన్ని వీక్షించి తరించడానికి భక్తులు భారీగా భద్రాచలం తరలివచ్చారు. ఈ అవతారాన్ని కనులారా కాంక్షిస్తే శుక్రగ్రహ బాధలు తొలగిపోతాయని ప్రతీతి. తొలుత అంతరాలయంలో రామయ్యకు ప్రత్యేక ఏకాంత తిరుమంజనం గావించారు. అనంతరం విశ్వక్సేన పూజ, పుణ్యాహావచనం నిర్వహించారు. ఈ సందర్భంగా వేదపండితులు వాళయార్ దివ్యప్రబంధనం చదివారు. తదుపరి ఉత్సవమూర్తులను బేడామండపం వద్దకు తీసుకొచ్చి ప్రత్యేకపూజలు జరిపారు. అనంతరం స్వామిని ప్రత్యేక పల్లకీలో అలంకరించి మాడ వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. కోలాట నృత్యాలు, సన్నాయివాయిద్యాలు, భక్తుల కోలాహలం మధ్య స్వామివారిని చిత్రకూట మండపానికి తీసుకొచ్చి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని వీక్షించి తరించారు. వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. భక్తుల కోలాహలం నడుమ సాయత్రం స్వామి వారికి తిరువీధి సేవను నిర్వహించారు.
రేపు శ్రీరామావతారం…
వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాల్లో భాగంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారు శ్రీరామావతారంలో దర్శనమిచ్చి భక్తులను తరింపజేయనున్నారు. లోకకంటకులైన రావణ, కుంభకర్ణాది రాక్షసులను సంహరించడానికై దశరధని కుమారులనిగా శ్రీమన్నారాయణుడు ధరించిన అవతారం శ్రీరామావతారం. వ్యక్తిగత సౌఖ్యాలకన్నా ధర్మాచరణయే ఉత్తమమైనదని అదే శాశ్వతమని భావించి, పరిపూర్ణమైన మానవుడు ఎలా ఉండాలో ఆచరించి చూపించిన ఆదర్శపురుషుడు, మర్యాదా పురుషోత్తముడు, మూర్తీభవించిన ధర్మస్వరూపుడు శ్రీరామచంద్రుడు. సూర్యగ్రహ బాధలున్నవారు శ్రీరామావతారాన్ని దర్శించడం వల్ల బాధల నుండి విముక్తిని పొందుతారని ప్రతీతి.
Vaikuntha Ekadashi Adhyayanotsavalu in bhadradri temple