Friday, April 19, 2024

వాల్మీకి రామాయణం ఒక విశిష్టమైన గ్రంథం

- Advertisement -
- Advertisement -

sri rama navami

 

1909వ సంవత్సరంలో ఒక అజ్ఞాత మహానుభావుడి ద్వారా ‘కాలిఫోర్నియా(అమెరికా) విశ్వ విద్యాలయం’కు చెందిన ‘బర్క్ లీ‘ గ్రంథాలయంలో చేరుకుని, ‘గూగుల్ సంస్థ‘ డిజిటలైజ్ చేసిన ఆంధ్ర వాల్మీకి, కవిసార్వభౌమ వాసుదాసు (వావిలికొలను సుబ్బరావు) ‘శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం’లో గ్రంథకర్త వాల్మీకి రామాయణం గురించి వెలిబుచ్చిన అభిప్రాయాలు అక్షర లక్షలు చేసే ఆణిముత్యా లు. వివరాల్లోకి పోతే….

వాల్మీకి సంస్కృత రామాయణం మూలంలోని 24,000 శ్లోకాలకు, శ్లోకానికి ఒకటి చొప్పున, తెలుగులో 24,000 పద్యాలను రాయాలని సంకల్పించుకున్నారు వాసుదాసస్వామి. ఇది జరగాలంటే శ్రీరామచంద్రుడే తనకు శరణ్యం అన్న నిర్ణయానికొచ్చారాయన. ఒకనాడు పారాయణం ముగిసిన తర్వాత, భగవత్ సన్నిధానంలో కూర్చొని, శ్రీమద్రామాయణం పుస్తకం ముందుంచుకుని, ప్రశ్న వేసుకున్నారు. ఆశ్చర్యకరంగా వచ్చిన సమాధానం ‘ఉత్తిష్ఠ హరి శార్దూల, లంఘయస్వ మహార్ణవమ్’ (‘లెమ్మా హరిశార్దూలా, యిమ్మహితార్ణవము దాటుమీ‘) అన్న శ్లోక రూపంలో సమాధానం లభించింది. భగవత్ కటాక్షానికి పాత్రుడనయ్యానని నమ్మి, 1900వ సంవత్సరంలో, ఆశ్వయుజ శుద్ధ దశమి నాడు, గ్రంథ రచన ఆరంభించారాయన.

రామాయణం, భారతం, భాగవతం అద్వితీయమైన గీర్వాణ భాషా గ్రంథాలు. ఈ మూడింటిలో ఆద్యమైంది రామాయణ కావ్యం. కావ్యాలలోకెల్లా ప్రధమంగా ఉత్పన్నమైంది కావడంతో ఆదికావ్యమైంది. రామాయణాన్ని చక్కగా తెలిసినవారు, అర్థం చేసుకోగలిగిన వారు మాత్రమే లోకానికి అందలి విషయాలను వివరించ సమర్థులు. అందరికీ అది సాధ్యమయ్యేది కాదు. అనేకరకమైన లౌకిక విషయాలను తెలుసుకోవాలనుకునే వారికి శ్రీ రామాయణాన్ని మించి తెలి పే గ్రంథం ఎక్కడా లేదు. పరమపదానికి పోవాలనుకునే కోరికగల వారికి, సుఖమైన మార్గాన్ని బోధించగల గ్రంథం రామాయ ణం తప్ప మరొకటి లేదు. కాలక్షేపానికి చదవడానికైనా రామాయ ణం లాంటి పుస్తకం ఇంకోటి లేదు. ఇహ-పర లోకాల్లో సుఖపడాలనుకునేవారికి, శ్రీ రామాయణ పఠనం అవశ్య కర్తవ్యం.

సీతారాములలో విశేషమేమిటంటే, వారు అవతార మూర్తులు కావడమే ! భగవంతుడే, శ్రీరాముడుగా, లోక రక్షణార్థం జన్మించాడన్న నమ్మకమే, లోకులందరు ఒకేవిధంగా శ్రీ సీతారాములను అర్చన చేయడానికి కారణమైంది. వాల్మీకి మహర్షి ఆ అవతార రహస్యాన్ని, తాను గ్రంథస్థం చేసిన శ్రీ రామాయణంలో వివరించాడు. వాల్మీకి మహ ర్షి, తను రచించిన ఆది కావ్యానికి శ్రీ రామాయణం అని పేరు పెట్టాడు. ఇందులో సీతాదేవి మహాత్మ్యాన్ని విశేషించి చెప్పడంవల్ల వాల్మీకి మహర్షే, శ్రీ రామాయణాన్ని ‘సీతాయాశ్చరి తం మహత్తు‘ అని వెల్లడిచేశాడు. ఆసక్తిగా శోధించిన వారికి, పరీక్షించిన వారికి మాత్రమే, వాల్మీకి రామాయణానికి, ఇతర రామాయణాలకు గల తారతమ్యం, వాల్మీకి రామాయణంలోని గొప్పద నం తెలుస్తుంది.

శ్రీ రామాయణం మహాకావ్యం. శ్రీమద్రామాయణంలో ఉత్తమోత్తమ మహాకావ్య లక్షణాలెన్నో వున్నాయి. వర్ణనలెన్నో వున్నాయి. రామాయణం గానం చేసినా, పఠించినా మనోహరంగా వుంటుంది. రామాయణంలో శృంగారం లాంటి నవ రసాలున్నాయి. అందులో శృంగార రసం ‘సంభోగ శృంగారం‘. వాల్మీకి శ్లోకాల భావం మాత్ర మే కాకుండా, అందులోని కొన్ని పదాలు ఎంత అర్థ గాంభీర్యం గలవిగా-రసవంతంగా వుంటాయో చెప్పలేము. ఇందులో హాస్యం, కరుణ, వీర, రౌద్రం, భయానక, బీభత్సం, అద్భుతం, శాంతం రసాలను కనుగొన వచ్చు.

ఇక అలంకారాల విషయానికొస్తే, శబ్దాలంకారాలని, అర్థాలంకారాలని రెండు రకాలున్నాయి. రామాయణంలో శబ్దాలంకారాలు తరచుగా కనబడవు. అంత్యానుప్రాసలు కొన్ని చోట్ల వున్నాయి. వర్షాన్ని వర్ణన చేసిన సందర్భంలో మన ఎదుట వర్షం కురుస్తున్నట్లే వుంటుంది. హేమంతాన్ని వర్ణిస్తుంటే, మనకు మంచులో తడుస్తున్నామా అనిపిస్తుంది. అడవులలో జరిగినవి, మనమెప్పుడూ చూడనివి-విననివి చదువుతుంటే, మన కళ్లకు కట్టినట్లే వుంటుంది. తన వర్ణనా చాతుర్యంతో వాల్మీకి, పాఠకులను, తన చేతిలో బొమ్మలా చేసి, ఇష్టమొచ్చినట్లు ఆడుకుంటాడు.

వాల్మీకి రామాయణం ‘ధ్వని కావ్యం’. కావ్యానికి ప్రధానమైం ది ధ్వని. కావ్యానికి ప్రాణం ధ్వని. ధ్వని లేని కావ్యం శవంతో సమానం. రామాయణంలో ధ్వని విశేషంగా వుంది. కావ్యమంతా ధ్వన్యర్థం వుండడమే కాకుండా, పలు శ్లోకాలకు విడిగా ధ్వన్యర్థం వుంది. రుతు వర్ణనలలో ధ్వని స్ఫురిస్తుంది. శ్రీ రామాయణంలోని కవితా చమత్కృతిని విశదీకరించాలంటే, ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇంతెందుకు ! కాళిదాసు, భవభూతి అంత గొప్ప వాళ్లు కావడానికి రామాయణమే కారణం. కాళిదాసు రచనలు గమనిస్తే, ఆయన వాల్మీకి శిష్యుడని తెలియడమే కాకుండా, గురు శిష్యుల తారతమ్యం స్పష్టంగా బయట పడుతుంది. వాల్మీకి రామాయణం నుంచి కాళిదాసు లాంటి వారు గ్రహించినవి ఎన్నో వున్నాయి. వేదవ్యాసుడంతటి వాడు వాల్మీకి శ్లోకాలను అనువదించగా లేంది, వేరేవారి సంగతి చెప్పాలా ! ఎవరికైనా సత్కవి కావాలని కోరికుంటే, వారు వాల్మీకి రామాయణాన్ని అనేక పర్యాయాలు, శ్రద్ధగా-భక్తితో పఠించాల్సిందే.

రామాయణం పారాయణం చేసినవారి కోరికలు నెరవేర్చే శక్తి, రామాయణానికి వుండడానికి కారణం, అది భగవత్ కథ కావడానికి అదనంగా సర్వజ్ఞుడైన వాల్మీకి కూర్చిన బీజాక్షరాల మహాత్మ్యమే. శ్రీమద్రామాయణం వేదంతో సమానమైందే కాకుండా వేదమే అనాలి. వేద పఠనం అవశ్యంగా చేయాల్సిన కార్యక్రమాల్లో, రామాయణ పఠనం నియమితమైంది. శత కోటి, అంటే 24 గాయత్రీ బీజాక్షరాలతో కూడిన 24,000 గ్రంథాల రామాయణంలోని ప్రతి అక్షరానికి మహా పాతకాలను నాశనం చేయగల శక్తిగలదని కొందరంటారు. కొందరేమో, శత కోటి రామాయణాన్ని వాల్మీకి సంగ్రహంగా చెప్పాడంటారు. ఇలాంటి మహిమ రామాయణంలో వుండడానికి కారణమేంటో ఆలోచించాలి. వాల్మీకి సూత్రాన్ననుసరించి, రామాయణం వేద స్వర సముద్ధృతంగా, సర్వశ్రుతులందున్నట్లుగా తెలుస్తోంది. రామాయణం ఒక మహత్తరమైన సాంఖ్య శాస్త్రం.

శ్రీరాముడు సామాన్య ధర్మాలన్నీ ఎలా అనుష్టించింది, కష్ట కాలంలో ఎలా ప్రవర్తించింది, సుఖ కాలంలో ఎలా నడచుకుంది, ఎలాంటెలాంటి వారి మీద ఏ విధమైన అభిప్రాయంతో మెలిగేవాడనేదీ, వీటి కారణాలేంటి అన్న విషయాలన్నీ చర్చించాల్సినవే. రాముడి పైనా, ఆయన తమ్ములపైనా ఏక పత్నీవ్రతం విషయంలో కూడా విరుద్ధాభిప్రాయాలను వెలిబుచ్చిన వారున్నారు
ఈ విషయాలన్నీ చెప్పిన వాసుదాసు గారు రామాయణ గ్రంథమేమో చాలా గొప్పదనీ, రాసిన కవేమో బ్రహ్మర్షి అనీ, ఇందులోని మర్మాలేమో మెండుగా వున్నాయనీ, రాసిందేమో సంస్కృత భాషలో అనీ, చదివినా కొద్దీ విశేషాలు కనిపిస్తాయనీ, అందుకే తాను తెలుగులో ఆంధ్ర వాల్మీకి రామాయణంగా దీన్ని రాశాననీ, పాఠకులు ఆంధ్ర వాల్మీకి రామాయణాన్ని దయతో చదివి తనను ధన్యుడిని చేయండనీ విన్నవించుకుంటాడు.

రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు

బాల కాండ (77)సర్గలు                (2256)శ్లోకాలు
అయోధ్య కాండ (119)సర్గలు          (4415)శ్లోకాలు
అరణ్య కాండ (75)సర్గలు              (2732)శ్లోకాలు
కిష్కింధ కాండ (67)సర్గలు            (2620)శ్లోకాలు
సుందర కాండ (68)సర్గలు             (3006)శ్లోకాలు
యుద్ధ కాండ (131)సర్గలు            (5990)శ్లోకాలు
ఉత్తర కాండ (110)సర్గలు              (3234)శ్లోకాలు
ఏడు కాండలు (647)సర్గలు           (24,253)శ్లోకాలు

Valmiki Ramayana is a remarkable treatise
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News