Friday, March 29, 2024

సాహిత్య గట్టికోట వట్టికోట

- Advertisement -
- Advertisement -

స్వసుఖం కోరని వాడు /వారం వారం మారని వాడు /రంగులు అద్దుకోలేనివాడు /అబద్ధాసురుని పాలిట తల్వార్ అల్వార్ అని దాశరధి చేత కీర్తించబడి ‘వాడు చరిత్రకారుడు కాదు వాడే ఒక చరిత్ర’ అంటూ కాళోజీ చే ప్రశంసలందుకున్న తెలంగాణ వైతాళిక దిగ్గజం, తెలంగాణ సాహితీ సరస్వతి కన్న మరో అక్షరం వట్టి కోట ఆళ్వారుస్వామి. తెలంగాణ ప్రజల జీవితాన్ని పోరాట తత్వాన్ని, సంస్కృతిని నరనరాన జీర్ణించుకుని గ్రంథ పఠనం ద్వారా లోకజ్ఞానం కలుగుతుందని సమాజాన్ని అర్థం చేసుకొని చైతన్య పరచవచ్చని ఊరూరా గ్రంథాలయ ఉద్యమాన్ని నిర్వహించి ప్రజా చైతన్యానికి బాటలు వేసిన ప్రముఖ సాహిత్య దిగ్గజం వట్టి కోట.

నిబద్ధతను నిండుగా అవపోసన పట్టుకుని నైతిక విలువలను చెప్పి, రాసి రాసింది చేసిఆచరించి చూపిన మహావ్యక్తి. ఒక చేతిలో గన్ను ఇంకొక చేతిలో పెన్నుతో తెలంగాణ జాగృతి కోసం తెలంగాణ మట్టిగడ్డపై పోరు విత్తనాలు జల్లి ఉద్యమ సుమాలను పూయించిన సాహిత్య ఉద్యమ రైతు వట్టి కోట. తన కలాన్ని మర ఫిరంగుగా అక్షరాలను ఇనుప గుళ్ళుగా మార్చి నిరంకుశ బూర్జు వా గట్టి గోడలను కూల్చిన ఘనుడు. చాకిరిని నిర్మూలించడం కోసం వెట్టికోటలను కాల్చిన కాగడ. నవ తెలంగాణ నిర్మాణానికి సాంస్కృతిక పునాదులు వేసిన కవి, కార్మిక వైతాళికుడు. వలసవాదం, భూస్వామ్యం కింద నలుగుతున్న తెలంగాణను విముక్తి చేయడం సామాజిక బాధ్యతగా గుర్తించిన నవయుగ వైతాళికుడు. 1915 నవంబర్ 1న నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం చెరువు మాదారం గ్రామంలో ఓ నిరుపేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు.

సింహాద్రమ్మ, రామచంద్ర చార్యులు ఆయన తల్లిదండ్రులు. తండ్రి వట్టి కోట చిన్నతనంలోనే చనిపోవడంతో పొట్ట కూటి కోసం అనేక పనులు చేశాడు అదే క్రమంలో కాంచనపల్లి సీతారామారావు అనే ఉపాధ్యాయుని వద్ద వండి పెడుతూ విద్యాభ్యాసం, సారస్వతాభ్యాసం పూర్తి చేశాడు. తదుపరి సూర్యాపేట గ్రంథాలయంలోని నాలుగు గోడల మధ్య విద్యాభ్యాసం, లోకజ్ఞానాన్ని సంపాదించుకున్నారు. ఆ గ్రంథాలయాన్ని గురువుగా మార్చుకొని సాహిత్య ఊపిరిపోసుకున్నారు. ఆంగ్లం, ఉర్దూ భాషలు కూడా నేర్చుకొని తనకు తానుగా ప్రపంచాన్ని పరిచయం చేసుకున్న గ్రహణశీలి. ఆ తర్వాత విజయవాడలో వెల్కమ్ హోటల్లో సర్వర్‌గా పని చేస్తూ సాహిత్యకారులతో సంబంధాన్ని అనుబంధాన్ని కొనసాగించారు అక్కడే స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని జైలు పాలయ్యాడు. 1936 -37 హైదరాబాదు చేరి గోల్కొండ పత్రిక ప్రూఫ్ రీడర్‌గా, తరువాత మీర్జాన్ పత్రికకు ఫ్రీ లాన్ జర్నలిస్ట్‌గా పని చేశాడు.

ఇదే సమయంలో నిజాంను గడగడ లాటించిన ఆంధ్ర మహాసభ సమావేశాలకు హాజరయ్యేవాడు. ఆంధ్ర మహాసభ నల్లగొండ జిల్లా అధ్యక్షునిగా, కమ్యూనిస్టు పార్టీ నాయకునిగా, స్టేట్ కాంగ్రెస్, ఆర్య సమాజం, అభ్యుదయ రచయితల సంఘం, తెలంగాణ రచయితల సంఘం వంటి సామాజిక రాజకీయ సాహిత్య సంస్థలన్నింటికీ కార్యకర్తగా నాయకుడిగా పని చేశారు గ్రంథాలయ ఉద్యమ ప్రేరణ నుండి బయలుదేరి నిజాం వ్యతిరేక ఉద్యమం దాకా నడిచిన ప్రజా చైతన్య శీలి వట్టికోట. ఆయన చర్యలు నిజాంకు కోపం తెప్పించి వట్టి కోట జైలు పాలయ్యాడు. నిజామాబాద్ జైలులో దాశరథితో పరిచయం వారి ఇరువురికీ విడదీయరాన్ని బంధాన్ని ఏర్పరిచింది వారి మధ్య ఎప్పుడూ సాహిత్య చర్చలు జరిగేవి. దాశరథి పద్యాలను వట్టి కోట గోడలపై రాసి దెబ్బలు తిన్న సాహిత్య అభిలాషి. విజ్ఞానానికి విలువ కట్టని సమాజం వృద్ధి చెందదు వికసించదు అని బలంగా నమ్మి హైదరాబాదులో దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించారు.

సురవరం రాసిన ‘హైందవ ధర్మాలు ప్రాథమిక సత్యాలు’ ప్రజాకవి కాళోజీ రచించిన నా గొడవ మొట్టమొదటగా దేశోద్ధారక నుండే ప్రచురింపజేశారు. తెలంగాణ ప్రము ఖ రచయితలు రచించిన 35 పుస్తకాలు ఈ దేశోద్ధారక గ్రంథమాల నుంచి ప్రచురించబడ్డాయి. ఊరూరా తిరుగుతూ కవితలు, రచనలు సేకరిస్తూ గ్రంథాల పంచుతూ ప్రజా చైతన్యానికి బాటలు వేసిన సాహిత్య బాటసారి వట్టికోట. కడివెండిలో దొడ్డి కొమురయ్య నాయకత్వంలో జరిగిన ఊరేగింపుపై నిజాం పోలీసుల కాల్పులలో దొడ్డి కొమరయ్య మరణించడంపై ఆవేదనచెంది కాల్పులపై పద్మజా నాయుడుతో కలిసి నిజ నిర్ధారణ నిర్వహించిన మొదటి పౌర హక్కుల నాయకుడు, నాటి తెలంగాణ సామాజిక స్థితిగతులను తెలియపరుస్తూ రాసిన తెలంగాణ మొట్టమొదటి నవల ‘ప్రజల మనిషి’. జైల్లో ఖైదీల స్థితిగతులను సమూలంగా తెలియపరుస్తూ జైలు లోపల అనే నవలలు రాశాడు.

1951లో గుమస్తా పత్రికను స్థాపించారు. గుమస్తా సంఘం నాయకునిగా గుమస్తాల సమస్యలపై పోరాటాలు చేసి కొన్ని హక్కులు సాధించడంలో సఫలీకృతుడైనాడు. ధర్మరాజు కలం పేరుతో ఎన్నో కథలు, కథానికలు రాశాడు. తెలంగాణ రాజకీయ సామాజిక స్థితిగతులను తెలియపరుస్తూ రాయబడ్డ అసంపూర్తి నవల గంగు. సామాన్యుడి జీవితాన్ని సాహితీ పీఠం ఎక్కించిన సాహితీ ద్రష్ట. దళితుల దుర్భర స్థితికి అద్దంపట్టే కాపీర్లు కథ, సాయుధ పోరాట విరమణ వ్యతిరేకిస్తూ రాజకీయ బాధితుడు కథలో కమ్యూనిస్టు విధానాన్ని తప్పుపట్టిన ధీశాలి. ఎవరి తిండి వారు తినొచ్చు అంటూ తెలుగు సాహిత్యంలో ఎద్దు మాంసంపై చర్చ లేవనెత్తిన సామాజిక స్పృహ కలిగిన రచయిత.

దొరలు, జాగీర్దార్ల ఆగడాలను పూసగుచ్చినట్టు గిర్ధవర్ కథలో వివరించాడు. తన రచనల ద్వారా ప్రసరించిన అభ్యుదయ కిరణాలు నేటి నవతెలంగాణ నిర్మాణానికి దిశానిర్దేశం చేయగల దివిటీలని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదు. తెలంగాణ భాషకు యాసకు పెద్ద పీట వేసిన సాహిత్య మేరు నగధీరుడు. 1961 ఫిబ్రవరి 5న వట్టికోట ఈ లోకాన్ని విడిచి వెళ్ళాడు. తనతో జైలు జీవితం గడిపిన వట్టి కోటకు దాశరథి తమ అగ్నిధార సంకలనాన్ని అంకితం చేయడం ఆయన ఎంతటి మానవీయ మనిషి అర్థం చేసుకోవచ్చు.

 

ములక సురేష్- 9441327666

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News