లాక్డౌన్తో పంట ఉత్పత్తుల క్రయ, విక్రయాలకు కష్టాలు
రాష్ట్రంలో కూరగాయల విక్రయానికి వాహనాలకు అనుమతి
గ్రామాల్లోనే వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు
రైతుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు
మన తెలంగాణ/హైదరాబాద్: లాక్డౌన్ నేపథ్యంలో జాతీయ వ్యవసాయ మార్కెట్ (ఇనామ్) పద్ధతిలో పంట ఉత్పత్తుల సేకరణ ప్రక్రియ సాధ్యమయ్యేలా లేదు. ఏప్రిల్ 2వ తేదీ నుంచే కేంద్ర ప్రభుత్వం ఇనామ్ ద్వారా కొనుగోళ్ల ప్రక్రియ చేపడుతామని ప్రకటించనప్పటికీ, కార్యాచరణలో మాత్రం శూన్యంగా ఉంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన విధానం సత్ఫలితాలను ఇస్తోంది. ముఖ్యంగా లాక్డౌన్ సమయంలో కూరగాయలు, పండ్ల రైతులు నష్టపోకుండా ఉండటానికి వాళ్లకు ప్రత్యేక అనుమతులు ఇస్తున్నారు. తద్వారా వాహనాల ద్వారా మున్సిపాలిటీలు, పట్టణాలకు కూరగాయలు తీసుకెళ్లి ఎప్పటికప్పుడు విక్రయించుకుంటున్నారు. ఇలా లాక్డౌన్ సమయంలో మొబైల్ రైతు బజార్ల ద్వారా 500 ప్రాంతాలకు వినియోగదారులకు కూరగాయలు, పండ్లు అందుబాటులో ఉంటున్నాయి.
అలాగే రాష్ట్రంలో ఈ సమయంలో ప్రధానంగా వచ్చే వరి, మొక్కజొన్న, శనగ పంటలను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వమే ప్రత్యేకంగా దాదాపు 8 వేల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. మార్కెట్ యార్డులన్నింటిని మూసేసి, గ్రామాల్లోనే కొనుగోళ్లు చేపడుతోంది. దీంతో తెలంగాణ రైతులకు పెద్దగా ఇబ్బందేమి ఉండటం లేదు. అయితే మిగతా రాష్ట్రాల్లో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఇనామ్ పద్ధతిలో కొనుగోళ్లు చేపడుతామని కేంద్రం చెప్పింది. అయితే అందుకు అనుగుణంగా ఇనామ్ వ్యవస్థ లేదు. దేశంలో దాదాపు 12 కోట్ల మంది రైతులుండగా, కేవలం కోటిన్నర రైతులు, 1,27,963 మంది వ్యాపారులు 70,904 కమీషన్ ఏజెంట్లు ప్లాట్ఫామ్లో ఉన్నారు. రాష్ట్రంలో 47 మార్కెట్లు మాత్రమే ఇనామ్లో నోటిఫై చేశారు. ఇంటర్నేట్ పరిజ్ఞానం అంతగా తెలియని రైతులకు ఆన్లైన్లోకి వెళ్లడం కంటే, మార్కెట్లో నేరుగా అమ్ముకోవడానికే సముఖతను వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఒక వ్యాపారి ఆన్లైన్లో మొక్కజొన్నను కొనడానికి ప్రయత్నించాడు, కాని రవాణాకు సంబంధించి చాలా ఇబ్బందులతో మానుకున్నట్లు పేర్కొన్నాడు.
ప్రస్తుతం పోర్టల్తో దేశవ్యాప్తంగా 585 మంది మార్కెట్లు అనుసంధానించారు. అయితే దేశంలో 6,946 ఎఎమ్సి మార్కెట్లు ఉండగా, ఇందులో 16 రాష్ట్రాలు, 02 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 585 మార్కెట్లు మాత్రమే ఇ-నామ్ ప్లాట్ఫామ్తో అనుసంధానంలో ఉన్నాయి. అంటే మొత్తం మండిలలో 8.42 శాతం మాత్రమే. ఇనామ్లో కొనుగోలుదారు, రైతు ఇద్దరూ నమోదు చేసుకోవాలి. రైతు తన ఉత్పత్తుల వివరాలను, పంట యొక్క ఫోటోను ఇనామ్ పోర్టల్లో అప్లోడ్ చేయాలి. అప్పుడు కొనుగోలుదారుడు దానిని చూసి రేటు నిర్ధారిస్తాడు. అయితే అంతకు ముందు పంట ఉత్పత్తులను గ్రేడింగ్ చేస్తారు. దాని ఆధారంగా ఏ రాష్ట్రంలోనైనా కొనుగోలుదారుడు యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం రైతుల దగ్గరకు వెళ్లి గ్రేడింగ్ చేసే పరిస్థితులు లేవు. గిడ్డంగుల వద్ద గ్రేడింగ్ చేసే దానిపై స్పష్టత లేదు. పూర్తిస్థాయిలో ఇనామ్ను ఆధునీకరించి, అన్నదాతలకు ఉపయోగపడేలా తెస్తేనే మేలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.