ముంబై: కమ్యూనిస్టు సీనియర్ నేత, మాజీ లోక్సభ సభ్యురాలు రోజా దేశ్పాండే శనివారం మధ్యాహ్నం తన నివాసంలో వృద్ధాప్య అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. ఆమె వయస్సు 91 సంవత్సరాలు. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులలో ఒకరైన శ్రీపద్ అమృత్ డాంగే కుమర్తె అయిన రోజా దేశ్పాండేకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. అఖిల భారత విద్యార్థుల సమాఖ్య(ఎఐఎస్ఎఫ్) సభ్యురాలిగా ఆమె గతంలో సంయుక్త మహారాష్ట్ర ఉద్యమం(మహారాష్ట్ర రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమం), గోవా విముక్తి పోరాటంలో చురుకుగా పాల్గొన్నారు. 1974లో ఆమె బొంబాయి సౌత్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి లోక్సభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఉద్యోగినులకు ప్రసూతి సెలవులు సాధించడం కోసం ఆమె గట్టిగా కృషి చేశారు. కార్మిక సమస్యలు..ముఖ్యంగా మహిళా కార్మికుల సంక్షేమం కోసం ఆమె వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కమిటీలలో సభ్యురాలిగా పోరాడారు. రోజా దేశ్పాండే మృతి పట్ల మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు.