జైపూర్: వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఓ వ్యక్తిపై దాడి చేసి.. గుండు కొట్టించి… సగం మీసాలు తీసేసి.. చెప్పుల దండ మెడలో వేసి ఊరేగించిన సంఘటన రాజస్థాన్లోని ఉదయ్ పూర్ ప్రాంతం రాజ్సమంద్ జిల్లా డియోగఢ్లో వెలుగులోకి వచ్చింది. బాధితుడిని చిత్రహింసలు పెట్టిన నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కేల్వాడాలోని భగత్ గ్రామంలో దిలీప్ నాథ్ అనే వ్యక్తి, పార్సీ అనే మహిళతో సహజీవనం చేస్తున్నాడు. దీంతో ఇద్దరు కల్బలియా కులానికి చెందినవారు. పార్శీ బంధువులు బలవంతంగా దిలీప్ దగ్గర నుంచి ఆమెను తీసుకెళ్లారు. దిలీప్ను ఏడుగురు కిడ్నాప్ చేసి మాల్ ఖేడ్ గ్రామంలోకి తీసుకెళ్లారు. అనంతరం దిలీప్ను చేతులు, కాళ్లు తాళ్లతో కట్టేసి… కాల్చిన ఇనుప రాడ్డును వాతలు పెట్టారు. గుండు కొట్టించడమే కాకుండా సగం మీసాలు తీసేశారు. అనంతరం మహిళ వస్త్రాలు అతడికి బలవంతంగా ధరింపచేసి చెప్పుల దండ మెడలో వేసి ఊరేగించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దిలీప్ కుమార్ వదినా మీరా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అమెథ్ పోలీస్ స్టేషన్ అధికారి ముఖేష్ షేక్ ఏడుగురిపై ఐపిసి 143, 365, 342, 323 పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులు శంకర్ నాథ్, భీఖ్ నాథ్, పోఖర్ నాథ్, లడ్డు నాథ్, ప్రభు నాథ్ కామ్ నాథ్, డియోనాథ్, గణేష్ నాథ్గా గుర్తించామని పోలీసులు వెల్లడించారు. ఈ వీడియోను సోషల్ మీడియా నుంచి తొలగించామని పోలీసులు తెలిపారు.