కాన్పూర్(యుపి): తన భర్త చేసింది తప్పని, అతనికి ఆ శిక్ష పడాల్సిందేనని పోలీసు ఎన్కౌంటర్లో మరణించిన గ్యాంగ్స్టర్ వికాస్ దుబే భార్య అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఎన్కౌటర్లో మరణించిన వికాస్ దుబేకు శనివారం నాడిక్కడ గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య అంత్యక్రియలు జరిగాయి. తన భర్త వికాస్ అంత్యక్రియలకు హాజరైన రిచా ఈ సందర్భంగా పత్రికా విలేకరులపై కూడా ఆగ్రహం ప్రదర్శించారు. భార్య, కుమారుడి సమక్షంలో వికాస్ దుబే అంత్యక్రియలు విద్యుత్ స్మశానవాటికలో అతని బావమరిది దినేష్ తివారీ నిర్వహించాడని కాన్పూర్ రూరల్ ఎస్పి బ్రిజేష్ శ్రీవాస్తవ తెలిపారు. తనను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులపై తన అనుచరుల చేత కాల్పులు జరిపించి 8 మంది పోలీసుల మరణానికి కారకుడైన వికాస్ దుబే ఎన్కౌంటర్లో మరణించిన సంఘటనపై విలేకరులు దుబే భార్య రిచాను ప్రశ్నించినపుడు అవును..అతను తప్పుచేశాడు. అందుకు ఫలితం అనుభవించాల్సిందే అంటూ జవాబిచ్చారు.
కాగా, విలేకరులు పెద్ద సంఖ్యలో అక్కడ ఉండడంతో అసహనానికి గురైన ఆమె వారు వెళ్లిపోవాలంటూ గట్టిగా కేకలు వేశారు. అంతేగాక వారిని అసభ్యపదజాలంతో దూషించారు. తన భర్త ఎన్కౌంటర్కు మీరే కారణమంటూ ఆమె విలేకరులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దుబే అంత్యక్రియల అనంతరం పోలీసులు ఆమెను, ఆమె కుమారుడిని తమ వాహనంలో గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకువెళ్లారు. వారిని ఎక్కడకు తీసుకెళ్లారో వివరాలు చెప్పడానికి పోలీసులు నిరాకరించారు. ఇలా ఉండగా.. తన కుమారుడికి అంత్యక్రియలకు వికాస్ దుబే తండ్రి రాంకుమార్ దుబే దూరంగా ఉండిపోయారు. పోలీసుల చర్యను సమర్థించిన ఆయన పోలీసులు సరైన చర్యే తీసుకున్నారంటూ వ్యాఖ్యానించారు. తన కుమారుడి అంత్యక్రియలకు తాను హాజరుకానని ఆయన స్పష్టం చేశారు.
Vikas dubey wife says deserved his fate