ఐపిఎల్కు వివో దూరం
కొత్త స్పాన్సర్ అన్వేషణలో బిసిసిఐ
ముంబై: యుఎఇ వేదికగా జరుగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) ట్వంటీ20 టోర్నమెంట్కు దూరంగా ఉండాలని ప్రధాన స్పాన్సర్, చైనాకు చెందిన వివో సంస్థ నిర్ణయించింది. ఈ ఏడాది స్పాన్సర్గా ఉండనని వివో యాజమాన్యం భారత క్రికెట్ బోర్డుకు తెలిపింది. దీనికి బిసిసిఐ అంగీకరించింది. కొన్ని ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఈసారి ఐపిఎల్ ప్రధాన స్పాన్సర్గా వ్యవహరించలేనని వివో తేల్చి చెప్పింది. ఇదే విషయాన్ని భారత క్రికెట్ బోర్డుకు వివరించింది. దీనికి బిసిసిఐ యాజమాన్యం సమ్మతించింది. దీంతో ఈ ఏడాది ఐపిఎల్కు కొత్త స్పాన్సర్ను వెతుకోవాల్సిన పరిస్థితి బిసిసిఐకి ఏర్పడింది. మరోవైపు ప్రధాన స్పాన్సర్షిప్ నుంచి వివో తప్పుకుంటున్న విషయాన్ని గురువారం బిసిసిఐ అధికారికంగా ప్రకటించింది. అంతేగాక కొత్త స్పాన్సర్ కోసం త్వరలోనే టెండర్లను పిలువనున్నట్టు బిసిసిఐకి చెందిన ఓ అధికారి వెల్లడించాడు.
ఇదిలావుండగా ఐపిఎల్కు ఐదేళ్ల పాటు ప్రధాన స్పాన్సర్గా ఉండేందుకు చైనాకు చెందిన మొబైల్ తయారి సంస్థ వివో 2018లో ఒప్పందం కుదర్చుకొంది. ఇందుకుగాను రూ.2190 కోట్లను చెల్లించేందుకు వివో సంస్థ అంగీకరించింది. అయితే ఇటీవల భారత్చైనా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో వివోను ఐపిఎల్ స్పాన్సర్షిప్ నుంచి తొలగించాలనే డిమాండ్ ఊపందుకుంది. దేశ వ్యాప్తంగా పలు సంఘాలు వివోకు, భారత క్రికెట్ బోర్డుకు వ్యతిరేకంగా ప్రదర్శనలు కూడా చేస్తున్నాయి. దీంతో ఐపిఎల్కు ప్రధాన స్పాన్సర్గా వ్యవహరించి సమస్యలు కొని తెచ్చుకోవడం కంటే దూరంగా ఉండడమే మంచిదని వివో యాజమాన్యం భావించింది. ఇందులో భాగంగానే ఈసారి స్పాన్సర్ వ్యవహరించనని బిసిసిఐకి స్పష్టం చేసింది. దీనికి అంగీకరించిన బిసిసిఐ కొత్త స్పాన్సర్ అన్వేషణలో పడింది. త్వరలోనే దీని కోసం టెండర్లను ఆహ్వానించాలని నిర్ణయించింది. ఇదిలావుండగా ఐపిఎల్ స్పాన్సర్గా వ్యవహరించేందుకు జియో, పతంజలి తదితర సంస్థలు ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం.
Vivo removed from IPL 2020 Title Sponsorship