Wednesday, April 24, 2024

విఆర్‌ఏల సమ్మె విరమణ

- Advertisement -
- Advertisement -

సిఎస్ సోమేశ్ కుమార్‌తో చర్చలు సఫలం మునుగోడు ఉప ఎన్నిక
తర్వాత సమస్యలు పరిష్కరిస్తామని హామీ నేటి నుంచి విధుల్లోకి

మన తెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వంతో విఆర్‌ఎల చర్చలు సఫలమయ్యాయి. 80 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న విఆర్‌ఏలు.. సమ్మె విరమిస్తున్న ట్లు ప్రకటించారు. బుధవారం రాష్ట్ర ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌తో బిఆర్‌కెఆర్ భవన్‌లో విఆర్‌ఎలు సమావేశమయ్యారు. సిసిఎల్‌ఏ డైరెక్టర్ రజత్‌కుమార్ షైనీ సమక్షంలో జరిగిన ఈ చర్చలలో విఆర్‌ఏ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎస్ సోమేశ్‌కుమార్ మాట్లాడుతూ విఆర్‌ఎల డిమాండ్లపై ప్రభుత్వం సానుభూతితో ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఎత్తి వేయగానే వారి డిమాండ్లను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు.

వెంటనే విధులకు హాజరుకావాలని కోరారు. ఈ సందర్బంగా విఆర్‌ఎలు పలు డిమాండ్లను సిఎస్‌కు విన్నవించారు. పే స్కేల్ వర్తింపు, సర్వీస్ నిబంధనలు, ప్రమోషన్లు, సమ్మె కాలానికి వేతనం ఇప్పించడం, కేసులు ఎత్తివేయడం, సమ్మె కాలాన్ని ప్రత్యేక సెలవుదినంగా ప్రకటించడం. సమ్మెకాలంలో మరణించిన విఆర్‌ఎల కుటుంబాలకు పరిహారం చెల్లింపు, వారసులకు ఉద్యోగాలు ఇవ్వడం తదితర డిమాండ్లను తెలిపారు. ఈ సందర్భంగా ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ.. సిఎస్ సోమేశ్ కుమార్‌తో జరిపిన చర్చలు సఫలం కావడంతో.. రేపటి నుంచి విధులకు హాజరవుతాయని పేర్కొన్నారు.

మునుగోడు ఉప ఎన్నిక ముగిసిన తర్వాత సమస్యలను పరిష్కారిస్తామని సిఎస్ చెప్పినట్లు ఆయన వెల్లడించారు. ప్రమోషన్లు, ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరామని, సిఎస్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. విఆర్‌ఎలు గత 80 రోజులుగా వారి హక్కుల కోసం ఉద్యమం చేశారు. సమ్మె కాలం జీతం, దానితో పాటు సమ్మె చేస్తున్నప్పుడు చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవడం వంటి వాటిపై మునుగోడు ఉప ఎన్నిక ముగిసిన తర్వాత అమలు చేస్తామన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రులు కెటిఆర్, హరీశ్‌రావుకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్, విఆర్‌ఎ జెఎసి సెక్రటరీ జనరల్ దాదే మియా, కన్వీనర్ డి. సాయన్న, కో కన్వీనర్ వంగూరు రాములు, వై. వెంకటేష్‌యాదవ్, మహమ్మద్ రఫీ, ఎం. గోవింద్, కె. శిరీష రెడ్డి, వై. సునీత, మాధవ్ నాయుడు, ఎల్. నర్సింహా రావు, సాగర్ తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News