Thursday, April 25, 2024

క్రికెట్ అకాడమీ చీఫ్‌గా లక్ష్మణ్..

- Advertisement -
- Advertisement -

VVS Laxman Appointed as NCA Director

ముంబై: ప్రతిష్టాత్మకమైన జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్‌సిఎ) డైరెక్టర్‌గా భారత మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్‌ను నియమించ నున్నారు. ఈ విషయాన్ని భారత క్రికెట్ బోర్డు(బిసిసిఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆదివారం ధ్రువీకరించాడు. త్వరలోనే లక్ష్మణ్ ఎన్‌సిఎ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఇప్పటి వరకు రాహుల్ ద్రవిడ్ ఎన్‌సిఎ చీఫ్‌గా వ్యవహరించాడు. అయితే ద్రవిడ్‌ను టీమిండియా ప్రధాన కోచ్‌గా నియమించడంతో ఆ పదవి ఖాళీ అయింది. ఇక స్థానాన్ని ఎంతో అపార అనుభవజ్ఞుడైన లక్ష్మణ్‌తో భర్తీ చేయాలని బిసిసిఐ నిర్ణయించింది. చాలా కాలంగా లక్ష్మణ్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. దీంతో అతనికే ఎన్‌సిఎ చీఫ్ బాధ్యతలు అప్పగించడం సబబుగా ఉంటుందని గంగూలీ భావించాడు. ఇక బిసిసిఐ పాలక మండలి కూడా లక్ష్మణ్‌కే మద్దతుగా నిలిచింది.

దీంతో ప్రతిష్టాత్మకమైన ఎన్‌సిఎ డైరెక్టర్‌గా లక్ష్మణ్ ఎంపిక దాదాపు ఖరారైంది. అతని పర్యవేక్షణలో ఎన్‌సిఎ మరింత బలోపేతంగా తయారవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గాయాలతో సతమతమయ్యే క్రికెటర్లకు ఎన్‌సిఎలో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. అంతేగాక విదేశీ సిరీస్‌లకు వెళ్లే ముందు టీమిండియాతో పాటు ఇండియాఎ, అండర్19 తదితర జట్లకు ఇక్కడ శిక్షణ ఇవ్వడం అనవాయితీగా వస్తోంది. అంతేగాక ఫామ్‌లేమీతో బాధపడే క్రికెటర్లు సయితం ఎన్‌సిఎలో కఠోర సాధన చేసి మళ్లీ గాడిలో పడేందుకు ప్రయత్నిస్తారు. కాగా, ఎన్‌సిఎ చీఫ్‌గా వ్యవహరించేందుకు లక్ష్మణ్ పెద్దగా ఆసక్తి చూపలేదని వార్తలు వచ్చాయి. అయితే, బిసిసిఐ కార్యదర్శి జైషా, అధ్యక్షుడు గంగూలీ అతనితో పలు దఫాలుగా చర్చలు జరిపి ఎన్‌సిఎ చీఫ్ పదవిని చేపట్టేలా చేశారని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.

VVS Laxman Appointed as NCA Director

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News