Friday, April 26, 2024

ఐటి పరిశ్రమ విస్తరణలో వరంగల్‌కు పెద్దపీట వేస్తున్న కెటిఆర్

- Advertisement -
- Advertisement -

 IT sector

 

వరంగల్ బ్యూరో : రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. అందులో భాగంగా ఐటి పురపాలక శాఖమంత్రి కెటిఆర్ వరంగల్‌లో ఐటి పరిశ్రమల ఏర్పాటుకు తీవ్రంగా కృషి చేస్తున్నారని, దాని ఫలితంగానే వివిధ సంస్థలు వరంగల్‌లో తమ కంపెనీ ప్రధాన కార్యాలయాలు ప్రారంభిస్తున్నాయని ఆయన తెలిపారు. ఆదివారం ఉదయం మడికొండ ఐటి పార్కులో ప్రముఖ క్వాడ్రెంట్ (qvadrant) రీసోర్స్ కంపెనీ ప్రధాన కార్యాలయ నిర్మాణానికి మంత్రులు ఎర్రబెల్లి , సత్యవతిరాథోడ్‌లు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడారు. రూరల్ జిల్లా ఆత్మకూరు గ్రామానికి చెందిన వంశీ ఆధ్వర్యంలో ఈ కంపెనీ ప్రారంభం కావడం అభినందనీయమన్నారు. కంపెనీ డైరెక్టర్లలో ఆంధ్రాకు సంబంధించిన భాగస్వాములున్నప్పటికీ తెలంగాణలోనే శాఖను ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. సిఎం కెసిఆర్ పాలనలో రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఆయన కొనియాడారు.

ప్రధానంగా వ్యవసాయరంగాన్ని గాడిలో పెట్టేందుకు మూడేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి ప్రపంచస్థాయి రికార్డును సిఎం కెసిఆర్ సొంతం చేసుకున్నారన్నారు. ప్రాజెక్టులు పూర్తి కావడంతో తెలంగాణ బీడు భూములన్ని పచ్చని పొలాలుగా మారాయని మంత్రి పేర్కొన్నారు. కెటిఆర్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో సమానంగా ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఐటి పరిశ్రమలను విస్తరిస్తున్నారని స్పష్టం చేశారు. వరంగల్ వంటి మహానగరంలో ఐటి పరిశ్రమలను ఏర్పాటు చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటి కంపెనీలను వరంగల్‌కు తీసుకరావడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. స్థానికంగా కంపెనీలకు సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పనలో తాను ముందుంటానన్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు స్థానికంగానే ఉండి ఉద్యోగాలు చేసుకునే రోజులు కళ్లముందుకే వచ్చాయన్నారు.

ప్రపంచమే తెలంగాణవైపు చూస్తుందని, అందులో భాగంగా ఐటి కంపెనీలు ద్వితీయ శ్రేణి పట్టణాల్లో పెట్టుబడులు పెట్టడం శుభపరిణామమన్నారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతకు మెరుగైన అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. ఐటి కంపెనీల్లో ఉపాధి అవకాశాలు స్థానికంగా పెరగగానే ,సంబర పడకుండా యువత వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకున్నప్పుడే కంపెనీలు ఉన్నతమైన అవకాశాలు కల్పిస్తాయన్నారు. మంత్రి సత్యవతిరాథోడ్ మాట్లాడుతూ… వెనుకబడిన ప్రాంతాలను కూడా సిఎం కెసిఆర్ అభివృద్ధి చేస్తున్నారన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటికే అనేక మార్పులు వచ్చాయని, రానున్నరోజుల్లో విద్యా, వైద్యం, రోడ్లు, పరిశ్రమలు, ఐటి తదితర రంగాల్లో ఉద్యోగాలు వస్తాయని ఆమె పేర్కొన్నారు. వివిధ దేశాల ఐటి కంపెనీల ప్రతినిధులు వరంగల్‌లో పెట్టుబడి పెట్టడడం హర్షనీయమని ఆమె స్పష్టం చేశారు.

Warangal is developing in IT sector
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News