Friday, April 26, 2024

రాజ్యాంగాన్ని రక్షించుకుందాం

- Advertisement -
- Advertisement -

పౌరసత్వ సవరణ చట్టం, భారతీయ పౌర జాతీయ, జాతీ య జనాభా జాబితాల వ్యతిరేక దేశవ్యాప్త నిరసనలు, అంతర్జాతీయ సమాజ అసంతృప్తి పెల్లుబికాయి. రాజ్యాంగ రక్షణ గురించి మాట్లాడుతున్నారు. రాజ్యాం గ ముప్పు ఇప్పుడే ఎందుకు వచ్చింది?
గత ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని సవ్యంగా అమలు చేసి ఉంటే అన్ని రంగాల్లో, వృత్తుల్లో విలువలు ఎందుకు పతనమయ్యాయి? అవినీతి ఎందుకు పెరిగింది? ఎన్నికల్లో ధన కండ బలాలు ఎందుకు పెరిగాయి? నేరస్థుల రాజకీయీకరణ, రాజకీయ నేరమయం ఎందుకు జరిగాయి? కుల మత విభజన ధోరణులు ఎందుకు చొరబడ్డాయి? రాజ్యాంగ పీఠిక లక్ష్యాలు ఎందుకు సాధించబడలేదు? సామాజిక సేవా దృక్పథంతో, త్యాగంతో నిండవలసిన రాజకీయాలు లాభసాటి వ్యాపారంగా, లూటీ వ్యవస్థగా ఎందుకు మారాయి?

రాజకీయులు ఊసరవెల్లులు ఎందుకయ్యారు? పేదరికం, నిరక్షరాస్యత, నిరుద్యోగం, ఆరోగ్యం, నీరు, ఆహార సమస్యలు ఎందుకు పరిష్కారం కాలేదు? ప్రభుత్వాల బలం, స్థిరత్వం ప్రజా శ్రేయస్సుకు కాక బహుళజాతి సంస్థల ప్రయోజనాలకు ఎందుకు ఉపయోగ పడుతున్నాయి? అయినా ప్రజలు సహించారు. నిన్నటి దాకా రాజనీతిజ్ఞులు కాని రాజకీయులు దేశాన్ని పాలించారు. పాలన కుంటింది. నేడు మతాంధులు పాలిస్తున్నారు. పుక్కిటి పురాణాల, ఊహాగాథల, అసత్య భావజాలాల తాత్వికత, మతాధార సమాజ విభజన మాత్రమే వీరికి తెలిసు. రాజకీయ సామరస్యత, సమన్వయాలు, సామాజిక నిర్మాణం, శాంతి భద్రతల నిర్వహణ, ఆర్థిక అభివృద్ధి, దేశ సమైక్యత, సమగ్రతలలో వీరు ప్రజాకంఠకులు. నేడు ప్రజాస్వామ్యం పతన తమ స్థాయికి, రాజ్యాంగం ప్రమాదతమ స్థితికి చేరాయి.
26.11.1949 న రాజ్యాంగ ఆమోద సందర్భంగా రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షులు అంబేడ్కర్, రాజ్యాంగ నిర్మాణ సభ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ వివేకవంతమైన హెచ్చరికలు చేశారు. మంచి రాజ్యాంగమైనా అమలుచేసేవారు చెడ్డవారైతే రాజ్యాం గం చెడుగా మారుతుంది. రాజ్యాంగం చెడ్డదైనా అమలుచేసేవారు మంచివారైతే అది మంచిగా మారుతుంది. ప్రజల మీద, లక్ష్య సాధన, రాజ్యాంగ అమలుకు వారు స్థాపించుకునే రాజకీయ పక్షాల మీద రాజ్యాంగ వ్యవస్థల పని తీరు ఆధారపడుతుంది. దేశం మతాతీతంగా ఉండాలి. మతం రాజ్యాన్ని అతిక్రమిస్తే స్వాతంత్య్రం రెండోసారి ప్రమాదంలో పడుతుంది. శాశ్వతంగా దూరమవుతుంది. చివరి రక్తం బొట్టు దాకా స్వాతంత్రాన్ని కాపాడుకోటానికి తీర్మానించుకోవాలి. అంబేడ్కర్. పాలకులు యోగ్యులు, సమగ్రతానిబద్ధులు, గుణవంతులు ఐతే లోపభూయిష్ట రాజ్యాంగాన్ని కూడా ఉత్తమంగా మార్చగలరు. రాజేంద్ర ప్రసాద్.

నిన్నమొన్నటి పాలకులు కొందరు చెడుగా (bad), కొందరు అధ్వాన్నంగా (worse) ఉండేవారు. నేటి పాలకులు అతిదుష్టులు (worst). ప్రజలను చైతన్యపరచవలసిన సంస్థలు, పక్షాలు బలహీనపడ్డాయి. రాజకీయ పక్షాలు వ్యాపార క్షేత్రాలయ్యాయి. నేటి పాలక పక్షాలు మతమౌఢ్య అడ్డాలు. రాజ్యాంగ వ్యవస్థల పనితీరు అధ్వాన్నమైంది. నేటి పాలకుల పూర్వీకులు దేశ విభజన కోరుకున్నారు. ముస్లింలు పాకిస్థాన్‌కు వెళ్లిపోతారని హిందువులు మాత్రమే భారత్‌లో ఉండి అది హిందూ దేశమవుతుందని ఆశించారు. వారి ఆశలు నెరవేరలేదు. నేడు పాశువిక ఆధిక్యతతో అధికారం చేపట్టిన మతాంధ వారసులు భారత్‌ను హిందూదేశంగా మార్చాలని ఉవ్విళ్లూరుతున్నారు. మతం రాజ్యాన్ని అతిక్రమిస్తోంది.
నేటి పాలకులకు రాజేంద్ర ప్రసాద్ ప్రస్తావించిన యోగ్యత, సమగ్రతానిబద్ధత, గుణగణాలు లోపించాయి. అందుకే రాజ్యాంగం ప్రమాదంలో పడింది. మన దేశ వ్యవస్థాపక పితామహులు విశిష్టత కలవారు. వివేకవంతులు. న్యాయవేత్తలు. దేశభక్తులు. స్వాతం త్య్ర సమరయోధులు. మతహత్యలు, అత్యాచారాలతో మతాధిక్య కేంద్రీకరణతో, అల్పమతస్థులను భయాందోళనలకు గురిచేసి అధికారం అందుకున్న మత ప్రచారకులలో ఈ గుణాలు ఉండవు.
మన రాజ్యాంగం ఆంగ్లేయ పాలనను తిరస్కరించింది. ఆనాటి సంస్థలను కొనసాగించింది. ఫలితంగా సామ్రాజ్యవాదం కొనసాగింది. 1990లలో సామ్రాజ్యవాద ప్రపంచీకరణ మొదలైంది. వీటిని నిన్నటి పాలకులు పాటించారు. నేటి పాలకులు ఈ సామ్రాజ్యవాద ప్రపంచీకరణ సామ్రాట్ అమెరికాకు దాసోహమయ్యారు. అందుకే మన ప్రజాస్వామ్యం, రాజ్యాంగం సంక్షోభం లో పడ్డాయి.

భారత రాజ్యాంగ పీఠిక: భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోడానికి, పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలలో స్వాతంత్య్రాన్ని చేకూర్చుటకు, వారందరిలో వ్యక్తిగౌరవం, జాతి ఐక్యత, అఖండతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుటకు సత్యనిష్టాపూర్వకంగా తీర్మానించుకొని 26 నవంబర్ 1949 న మన రాజ్యాంగ పరిషత్తులో పరిగ్రహించి శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాం.

ఈ పీఠిక రాజ్యాంగ మౌలిక రూపం. 1973 కేశవానంద భారతి- కేరళ ప్రభుత్వం కేసులో రాజ్యాంగ సవరణలు రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణాన్ని, మౌలిక స్వరూపాన్ని మార్చరాదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. రాజ్యాంగ పీఠికలోని అంశాలకు కట్టుబడి సవరణలు, చట్టాలు ఉండాలి. నేటి సంఘ్ ప్రభుత్వ చట్టాలు, సవరణలు ఈ పీఠికకు తూట్లు పొడిచేవే. నేటి పాలకులు ప్రజా రాజ్యాంగాన్ని పాలక గ్రంథంగా మార్చారు. సర్వసత్తాక పదానికి అర్థం మార్చారు. సామ్యవాదం ఆర్థిక, సామాజిక, రాజకీయ దోపిడీలను నిరోధిస్తుంది. నేటి పాలకులు ఆదాయ తారతమ్యాలను పోషిస్తున్నారు. వాణిజ్యాధికారులకే ఉద్దీపనలు ఇస్తున్నారు. సామాన్యులను ఇబ్బందులు పెడుతున్నారు. దోపిడీ పెంచారు.

సామ్యవాద భావాన్ని హత్య చేశారు. రాజ్యం మతాతీతంగా ప్రవర్తించటం, హేతు, భౌతిక, మానవ వాదాలను ప్రోత్సహించటం లౌకిక లక్షణం. ముందు ప్రభుత్వాలలో నిర్వీర్యమైన లౌకికభావం నేటి ప్రభుత్వంలో మాయమైంది. దేశాన్ని హిందు రాజ్యంగా మార్చాలన్న యత్నాలు అడుగడుగునా కన్పిస్తున్నాయి. సిఎఎలో లౌకిక రాహిత్యం పరాకాష్టకు చేరింది. ఎస్.ఆర్.బొమ్మై- భారత ప్రభుత్వం కేసులో బాబ్రీ మసీదు కూల్చివేత నేపథ్యంలో లౌకికత్వాన్ని మంటగలిపిన బిజెపి ప్రభుత్వాల రద్దును 1994 సుప్రీంకోర్టు తీర్పు సమర్థించింది. కరుడుగట్టిన మోడీ -షా ప్రభుత్వ అలౌకిక తాత్వికత దుర్మార్గమైంది.

మతాచారాలను, కార్యకలాపాలను క్రమబద్ధీకరించవచ్చు, నియంత్రించవచ్చు అన్న 25(2) అధికరణను తుంగలో తొక్కారు. సామ్యవాద, లౌకిక పదాలనే రాజ్యాంగం నుండి తొలగిస్తామని కేంద్ర గృహ మంత్రి హూంకరించారు. ఈ పదాల వాడుక మానేశారు. ప్రజాస్వామ్యం స్థానంలో ఏకఛత్రాధిపత్యం, నియంతృత్వం రాజ్యమేలుతున్నాయి. నిర్ణీత కాలానికి ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధుల ప్రభుత్వమే గణతంత్రం. మణిపూర్, గోవా నుండి మహారాష్ట్ర దాకా సంఘ్ ప్రభుత్వం గణతంత్రాన్ని నాశనం చేసింది. మార్క్సిజం పట్ల జనాకర్షణకు కారణం దాని శాస్త్రీయ సిద్ధాంతం కాదు. సామాజక న్యాయ తపన అని నెహ్రూ అన్నారు. నేటి ప్రభుత్వం న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తిని నాశనం చేసింది.
భయాలు, భ్రమలు, ఆశలతో న్యాయమూర్తులను లొంగదీసుకుంది. ఫలితంగా న్యాయమే తెరమరుగయింది. తన దుశ్చర్యలను ప్రశ్నించిన వారిని, తాత్వికతను ఆమోదించనివారిని హింసించింది. తప్పుడు కేసులతో అరెస్టు చేసింది. శిక్షించింది. హత్యలు చేయించింది. స్వేచ్ఛకు సంకెళ్ళు వేసింది. రాజ్యాంగ సమానత్వ అధికరణలు 14- 18 లను తిరస్కరించింది. సంఘీయులనే పదవులతో, అధికారాలతో సత్కరించింది. గౌరవించింది. ఇతరుల వ్యక్తి గౌరవాన్ని మంటగలిపింది. వీరి జాతి ఆర్య జాతి. మతం హిందువాదం. వీరి ఐక్యత అఖండతలు ఇవే.
భారతీయ సౌభ్రాతృత్వం, అంతర్జాతీయ మానవత్వం లేకుండా దేశ సమైక్యత, సమగ్రతలకు సంపూర్ణత లేదు. లౌకికత్వాన్ని మించిన పవిత్రత కలిగిన సౌభ్రాతృత్వాన్ని హిందుత్వానికి ముడేసింది. హిందూయేతరులను తిరస్కరించి భారతీయ సౌభ్రాతృత్వ భావనకు తూట్లు పొడిచింది. రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేసింది. కాషాయీకరించింది. దేశ సమాఖ్య స్వభావానికి గండికొట్టింది. సంఘీయులు మహిళలను అవమానించారు. బాబాలను, అమ్మలను, గోడ్సే భక్తులను ప్రోత్సహించారు. ప్రజాప్రతినిధులను చేశారు. ఈ పనులన్నీ సంఘ్ సిద్ధాంతకర్త గోల్వాల్కర్ ప్రవచించినట్లు రాజ్యాంగాన్ని రద్దు చేసి మనుస్మృతిని రుద్దడానికే. అందుకే ఇన్నాళ్ళూ లేనిది ఇప్పుడు రాజ్యాంగం ప్రమాదంలో పడింది.
బిజెపి ప్రభుత్వం రాజ్యాంగాన్నే కాదు దేశాన్నే భ్రష్టు పట్టించింది. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ సూచించినట్లు దేశ స్వాతంత్య్రాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మనదే. మన బుర్రలకు తట్టకపోయినా మేధావుల, బుద్ధిజీవుల, రాజనీతిజ్ఞుల, సామాజిక శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటించాలి. రాజ్యాంగ రక్షణలో భాగస్వాములు కావాలి. అది పౌరసత్వ సవరణ చట్ట నిరసనల మద్దతుతో కొనసాగాలి. అంతకంటే ముందు భయం వీడాలి. పరస్పర శత్రు పక్షాలు వైసిపి, టిడిపి రెండూ భయంతోనే రాజ్యాంగ విరుద్ధ సిఎఎకు ఓటేశాయని గుర్తించాలి. సంఘ్ ప్రభుత్వం ఎంత మందిని జైళ్ళలో పెడుతుందో చూద్దాం. అప్పుడు విప్లవం అనివార్యమవుతుంది.

సంగిరెడ్డి
హనుమంత రెడ్డి
9490204545

 

We Protect our Constitution
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News