*రామప్ప , లక్నవరం సరస్సుకు దేవాదుల నీరు
*మిషన్ కాకతీయ కింద 850 చెరువుల పనులు పూర్తి
మన తెలంగాణ/ములుగు : రామప్ప, లక్నవరం సరస్సులకు దేవాదుల ద్వారా గోదావరి నీటిని మళ్లించి ములుగు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని రాష్ట్ర గిరిజన సంక్షేమ, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి ఆజ్మీరా చందూలాల్ అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని వార్ రూం లో దేవాదుల, నీటి పారుదల మిషన్ భగీరథష ఐడిసి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రామప్ప, లక్నవరం సరస్సులతోపాటు ఇంచెన్ చెరువు, లోకం చెరువు, జాకారం, అబ్బాపురం, మల్లంపల్లి, రామచంద్రాపురం చెరువుల్లోకి గోదావరి నీటిని తరలించేందుకై దేవాదుల పైప్ లైన్ వెంట పాయింట్లను ఏర్పాటుచేయడానికి భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్రావు సుముఖుత వ్యక్తం చేశారని, అందు కు అనుగుణంగా అధికారులు పాయింట్లు ఏర్పాటుచేసి పనులను ప్రారంభించాలని ఆదేశించా రు. ఎస్సారెస్పీ డిబిఎం 38 కాలువతో పాటు ఐఆర్ 26 కాలువ మరమ్మత్తుల కోసం రూ. 14.41 కోట్లు మంజూరయ్యాయని ఈ పనులను త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. ఎస్సారెస్పీ ద్వారా నియోజక వర్గంలో 13,180 ఎకరాల ఆయా కట్టు సాగు కావాల్సి ఉందని అయితే గత పాలకుల నిర్లక్షంగా మూలంగా ఏనాడు సక్రమంగా నీళ్లు రాలేదని తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత ప్రాజెక్టు రీడిజైన్ భాగంగా ఎస్సారెస్పీ కాలువల మరమ్మత్తులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. రామప్పలో చెరువులోకి సహజ సిద్దంగా రావాల్సిన వరద జలాలు రాకుండా దేవగిరిపట్నం వద్ద ఎస్సారెస్పీ కాలువ వెళ్లడం వల్ల నీటి వరద ఎస్సారెస్పీ కాలువలో పడి లక్నవరం వెళ్తుందని దీంతో రామప్పకు రావాల్సిన వరద జలాలు రావడం లేదని తెలిపారు. మంగపేట మండలంలోని గౌరారం వాగుపై ప్రాజెక్టు నిర్మించడం కోసం రూ.10.03 కోట్లు ఎస్టిమేషన్ ను పంపించినట్లు నీటి పారుదల శాఖ ఎస్ఇ ప్రసాద్ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అయితే ఇక్కడ రైతులు భూ సేకరణకు అడ్డంగా అడ్డుపుడుతున్నారని మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం 20 ఎకరాల వరకు భూమి అవసరం ఉంటుందని అయితే అక్కడి రైతులు తమ భూములు ఇవ్వడానికి రావడం లేదన్నారు. అదే విధంగా కప్పవాగు, జీవివాగు, పాలెంవాగు, తదితర ప్రాజెక్టులను సంబంధించిన పురుగోతులపై సమీక్షించారు. అయితే ఇవన్నీ ప్రభుత్వ స్థాయిలోనే పెండింగ్లో ఉన్నాయని అధికారులు తెలిపారు. వచ్చే జూన్ నాటికి మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి రక్షిత మంచినీరును అందించే ఏర్పాటుచేయాలని మిషన్ భగీరథ ఏర్పాట్లు చేయాలని మంత్రిఆదేశించారు. ఈ మేరకు మిషన్ భగీరథ అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. అయితే కాంట్రాక్టర్లు, స్కిల్ లేబర్ కొరత కారణంగా ఓహెచ్ఎస్ఆర్ పనులు అలస్యమవుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ విపి గౌతమ్, ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ ఆజ్మీరా ప్రహ్లాద్, జడ్పీ ప్లోర్ లీడర్ సకినాల శోభన్, జడ్పీటిసిలు, జెట్టి సుజాత, మున్నిరున్ని సాబేగం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.