మన తెలంగాణ/హైదరాబాద్ : మేనేజ్మెంట్ కోటాలో ఎంబిబిఎస్, బిడిఎస్ సీట్ల భర్తీ కొరకు మంగళవారం నుంచి వెబ్ ఆప్షన్లు ప్రారంభమైనట్లు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పేర్కొంది. ఆయా సీట్లకు సంబంధించిన వివరాలను వర్సిటీ వెబ్సైట్లో పొందుపరిచినట్లు అధికారులు పేర్కొన్నారు. యూనివర్సిటీ గుర్తింపు పొందిన ప్రైవేట్ మైనార్టీ, నాన్మైనార్టీ మెడికల్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా బి, సి(ఎన్.ఆర్.ఐ) క్యాటగిరీ సీట్ల భర్తీకి ఆన్లైన్ కౌన్సిలింగ్ చేపట్టనున్నట్లు కాళోజీ వర్సిటీ తెలిపింది. ఇప్పటికే ధ్రువపత్రాలు పరిశీలన ప్రక్రియ పూర్తిచేసి మెరిట్ జాబితాను వెబ్సైట్లో పెట్టినట్లు అధికారులు స్పష్టం చేశారు. జాబితాలో అర్హులైన అభ్యర్ధులు కళాశాల వారీగా ఈనెల 17 వ తేది సాయంత్రం 4 గంటల వరకు వెబ్ఆప్షన్లను నమోదు చేసుకోవాలన్నారు. అభ్యర్ధులు కళాశాలల వారీగా సీట్ల వివరాలను www.knruhs.telangana.gov.inను సంప్రదించాలని అధికారులు పేర్కొన్నారు.