న్యూయార్క్ : కరోనాపై పోరులో భారత్ తన వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్ధాన్ని వివిధ దేశాలకు అందించడానికి భారత్ సంసిద్ధం కావడాన్ని ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రశంసించింది. ఈమేరకు ప్రపంచ ఆరోగ్యసంస్థ అధినేత టెడ్రోస్ అథనోమ్ గెబ్రెయేసస్ ప్రధాని నరేంద్రమోడీ భరోసా ఇవ్వడాన్ని ప్రశంసించారు. ప్రపంచ శ్రేయస్సు కోసం మనదగ్గరున్న శక్తులను, వనరులను కలసి కట్టుగా సమీకరించడం ద్వారానే కరోనా మహమ్మారిని తుదముట్టించగలం అని డబ్లుహెచ్ఒ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రెయేసస్ భారత ప్రధాని మోడీని కొనియాడారు. ఐక్యరాజ్యసమితి 75 వ సదస్సు సందర్భంగా మోడీ శనివారం మాట్లాడుతూ ప్రపంచంలో భారీ ఎత్తున వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే దేశంగా ప్రపంచ సమాజానికి తానొక హామీ ఇస్తున్నానని కరోనా సంక్షోభంలో పోరాడుతున్న దేశాలన్నిటికీ భారత్ వ్యాక్సిన్ మానవతా దృక్పథంతో అందిస్తుందని వెల్లడించారు.
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత సంక్షోభంలో కూడా భారత్ ఫార్మాక్యూటికల్ పరిశ్రమ దాదాపు 150 దేశాలకు అత్యవసర మందులను అందించ గలిగిందని వివరించారు. 193 సభ్య దేశాలున్న ఐక్యరాజ్యసమితి సమావేశంలో భారత్, పొరుగుదేశాలతోపాటు వ్యాక్సిన్ మూడోదశ క్లినికల్ట్రయల్స్తో ముందుకు వెళ్తున్నట్టు ప్రకటించారు. వ్యాక్సిన్ నిల్వకు, సరఫరాకు కూడా భారత్ సహకరిస్తుందని మోడీ ప్రకటించారు. అయితే కరోనా నియంత్రణలో ఐరాస తీరును మోడీ ప్రశ్నించారు. గత ఎనిమిది తొమ్మిది నెలలుగా యావత్ ప్రపంచం కరోనా మహమ్మారితో పోరాడుతుంటే ఐరాస ఎక్కడుంది? సమర్థమైన స్పందన ఎక్కడ ? అని మోడీ ఐరాసను ప్రశ్నించారు.