దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో పొట్టకూటి కోసం వలస వెళ్లిన ఓ కొడుకు తన తండ్రి మరణించడంతో తలకొరివి పెట్టేందుకు కూడా రాలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో కట్టుకున్న భార్యే తన భర్తకు తలకొరివి పెట్టింది. ఈ విషాద సంఘటన సిద్ధిపేట జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని హుస్నాబాద్ మండంలం, పందిల్ల గ్రామానికి చెందిన వెల్దండి రాములు, లక్ష్మమ్మ దంపతులకు కొడుకు కనకయ్య ఉన్నాడు. పొట్టకూటి కోసం కనకయ్య తల్లిదండ్రులను స్వగ్రామంలోనే వదిలి సూరత్కు వెళ్లాడు. అయితే, శనివారం అర్ధరాత్రి నిద్రలోనే రాములు మరణించాడు. తండ్రి మరణవార్తను బంధువుల ద్వారా తెలుసుకున్న కొడుకు కనకయ్య లాక్డౌన్ కారణంగా గుజరాత్లోనే చిక్కుకుపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో రాములు అంత్యక్రియలకు దాతలు తలా కొంత నగదు సాయం చేయడంతో కట్టుకున్న భార్య లక్ష్మమ్మనే తన భర్త రాములుకు తలకొరివి పెట్టగా.. తండ్రి అంత్యక్రియలను కొడుకు వీడియో కాల్ ద్వారా చూసి.. కన్నతండ్రి చివరి చూపునకు నోచుకోలేకపోయానని కన్నీరుమున్నీరయ్యాడు.
Wife Funeral to husband in Siddipet