Thursday, April 18, 2024

భర్తను హత్య చేసిన భార్య

- Advertisement -
- Advertisement -

wife murder her husband in Hyderabad

హైదరాబాద్: తన కుమార్తెలపై అత్యాచారం చేస్తున్నాడని కోపంతో భర్తను హత్య చేసింది ఓ భార్య. ఈ సంఘటన రాచకొండ పోలీస్ కమిషనరేట్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ విషయం బాధితుడు కన్పించడంలేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం….సహారా రోడ్డులోని వివేకానందనగర్ కాలనీలో గగన్ అగర్వాల్(38) నివాసం ఉంటున్నాడు. రెండేళ్ల క్రితం మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన గగన్ గత ఏడాది జులైలో పాతబస్తీకి చెందిన నౌసిన్ బేగంను రెండో వివాహం చేసుకున్నాడు.

నౌసిన్ బేగంకు మొదటి భర్తకు పుట్టిన నలుగురు బాలికలు, కుమారుడు ఉన్నాడు. పెద్ద కుమార్తెకు(16) ఏళ్లు ఉంటాయి. ఫిబ్రవరి,8వ తేదీ నుంచి గగన్ కన్పించకుండా పోయాడు. నౌసిన్‌బేగం ఇంటికి తాళం వేసి పాతబస్తీలోని పుట్టింటికి వెళ్లిపోయింది. గగన్ అగర్వాల్ సోదరుడు, నౌసిన్ గగన్ కన్పించకుండా పోయాడని ఎల్‌బి నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు వనస్థలిపురం పోలీసులకు బదిలీ చేశారు. విచారణలో భాగంగా నౌసిన్ బేగంను పోలీసులు విచారణ చేశారు. పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చిన పోలీసులు నౌసిన్‌ను తమదైన స్టైల్‌లో విచారణ చేయడంతో మొత్తం విషయం చెప్పింది.

తన పెద్ద కుమార్తెపై గగన్ అత్యాచారం చేశాడని, మిగతా వారిని లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని, దీనితో గగన్ హత్య చేసి ఇంట్లోని పాతిపెట్టినట్లు నౌసిన్ బేగం తెలిపింది. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గగన్ మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. నౌసిన్‌ను వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేశారు. కాగా గగన్‌ను నౌసిన్ బేగం ఒక్కతే హత్య చేసిందా లేక ఎవరైనా సాయం చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. విచారణలో మరిన్ని నిజాలు తెలుసుకుంటామని, గగన్ అగర్వాల్ హత్యతో సంబంధ ం ఉన్నవారిని అరెస్టు చేస్తామని వనస్థలిపురం ఇన్స్‌స్పెక్టర్ మురళిమోహన్ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News