సిడ్నీ: కరోనా నేపథ్యంలో ఈ ఏడాది ఐపిఎల్ పూర్తిగా రద్దయితే తమకు ఆర్థిక కష్టాలు ఖాయమని ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్ ఫించ్ ఆందోళన వ్యక్తం చేశాడు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది క్రికెటర్లకు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తున్న ఐపిఎల్ టి20 టోర్నీ రద్దయితే చాలా మంది ఆటగాళ్లకు ఆర్థిక సమస్యలు తప్పక పోవచ్చన్నాడు. ప్రతిభావంతులైన క్రికెటర్లు ఆర్థికంగా నిలదొక్కు కునేందుకు ఐపిఎల్ ఎంతో దోహదం చేస్తుందన్నాడు. ఇక, కరోనా వ్యాధి తీవ్ర రూపం దాల్చిన పరిస్థితుల్లో ఐపిఎల్ను తాత్కాలికంగా వాయిదా వేశారు. మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఈ మెగా టోర్నీని ఏప్రిల్ 15 నుంచి నిర్వహించాలని నిర్ణయించారు. అయితే కరోనా రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో ఏప్రిల్లో కూడా ఐపిఎల్ జరుగడం సందేహమే. ఇదే క్రికెటర్లను కలవరానికి గురి చేస్తోంది. కాసుల పంట పండించే ఐపిఎల్ రద్దయితే తమ పరిస్థితి ఏంటనీ చాలా మంది క్రికెటర్లు ఆందోళనకు గురవుతున్నారు. ఇక, ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ఆస్ట్రేలియా కెప్టెన్ ఫించ్ తన ఆందోళనను బహిర్గతం చేశాడు.
Will be financial loss if IPL 2020 Cancelled: Aaron Finch