రైతు నేతలకు మమత హామీ
బికెయు నేత రాకేశ్ టికాయత్తో భేటీ
న్యూఢిల్లీ: కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు తన మద్దతు ఉంటుందని బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ హామీ ఇచ్చారు. అన్యాయానికి వ్యతిరేకంగా రాష్ట్రాలన్నీ కలిసి రావాలని ఆమె కోరారు. సమాఖ్య నిర్మాణంలో రాష్ట్రాలను పక్కన పెట్టడం కేంద్రానికి తగదని ఆమె హితవు పలికారు. విధానపరమైన విషయాల్లో అన్ని రాష్ట్రాలు కలిసి రావాలని ఆమె సూచించారు. బుధవారం భారతీయ కిసాన్ యూనియన్(బికెయు) నేతలు రాకేశ్ టికాయత్, యుధ్వీర్సింగ్తో భేటీ అనంతరం మమత మీడియాతో మాట్లాడారు.
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బిజెపికి ఓటేయొద్దంటూ రైతు నేతలు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా రైతు నేతలు బిజెపిని ఓడించాలని పిలుపునిస్తున్నారు. రైతు నేతలతో చర్చలు జరిపేందుకు కేంద్రానికి ఇబ్బందేమిటని ఆమె ప్రశ్నించారు. బిజెపి పాలనలో ఆరోగ్యం, వ్యవసాయం, పరిశ్రమలు సహా అన్ని రంగాలు దెబ్బతిన్నాయని ఆమె అన్నారు. రైతుల ఉద్యమం పంజాబ్, హర్యానా, యుపిలకే పరిమితం కాదని దేశానికంతటికీ విస్తరించిందని ఆమె అన్నారు. రైతుల సమస్యలపై ఇతర రాష్ట్రాల నేతలతో చర్చించాలని తనను రైతు నేతలు కోరారని మమత తెలిపారు.