మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్లో ఓ యువతికి ‘కరోనా వైరస్’ వచ్చిదంటూ పోకిరీలు వేధించారు. అరుణాచల్ ప్రదేశ్కి చెందిన ఓ యువతి చైనీయులను పోలి ఉండటంతో పలువురు యువకులు ఆమెను వేధింపులకు గురిచేశారు. దీంతో తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకొని ఆవేదన వ్యక్తం చేసింది. యువతులకు కరోనా వైరస్తోనే కాదు ఇలాంటి వ్యక్తుల నుంచి దాడులను ఎదుర్కోవలసి వస్తుందని చెప్పుకొచ్చింది. మెడికల్ షాపుకు వెళ్తున్న క్రమంలో 15 మంది యువకులు తనను ‘కరోనా వైరస్’ అంటూ హేళన చేశారంటూ ఆరోపించింది.
ఈశాన్య ప్రజలు కూడా ఈ దేశ ప్రజలేనన్న సంగతి గుర్తుంచుకోవాలని తనను దేశ పౌరురాలిగా గుర్తించాలని ఆమె తెలిపింది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్రమోదీతో పాటు మంత్రి కెటిఆర్కు ట్విట్ చేసి చర్యలు తీసుకోవాలని కోరింది. ఆ యువతి ట్విట్పై తెలంగాణ మంత్రి కెటిఆర్ స్పందించారు. ఇలాంటి ఘటనలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిజిపి మహేందర్ రెడ్డిని కోరారు. అలాగే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా ప్రబలుతున్న సందర్భంగా అందరూ కలిసికట్టుగా ఎదుర్కొవాల్సిన అవసరం ఉందని ఆయన ప్రజలకు విన్నవించారు. వేధింపులు ఎదుర్కొన్న ఆ యువతి జర్నలిస్ట్ కావడం గమనార్హం.
woman journalist has corona harassment in Hyderabad