Saturday, April 20, 2024

కరెంట్ స్తంభానికి మహిళను కట్టేశారు… తమిళనాట కీచకపర్వం

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: ఆమె ఇద్దరు పిల్లల తల్లి..భర్త చనిపోయాడు..ఇళ్లలో పని చేసుకుంటూ ఇద్దరు పిల్లలను పోషిస్తూ బతుకీడుస్తున్న ఆ 35 ఏళ్ల మహిళకు మృగాళ్ల నుంచి లైంగిక వేధింపులు మొదలయ్యాయి. ఇంట్లో నుంచి కాలు బయటపెడితే చాలు ఆటో డ్రైవర్ల రూపంలో బయటే ఉన్న ఆ కామాంధులు ఆమెను సూటి పోటి మాటలు విసురుతూ..వెకిలి చేష్టలు చేస్తూ ఆమెను చిత్రహింసలకు గురిచేయసాగారు. ఇక భరింలేని స్థితిలో ఆమె ప్రతిఘటించింది. పోరాటానికి సిద్ధపడింది. దీంతో ఆ ఐదుగురు దుర్మార్గులు ఆమెను కరెంటు స్తంభానికి కట్టేశారు.

నీ సంగతి తేలుస్తామంటూ బెదిరింపులకు దిగారు. ఇది ఏ సినిమాలోని సన్నివేశమో కాదు. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా అరుమణైలో మార్చి 9వ తేదీన చోటుచేసుకున్న దారుణ దృశ్యం. కళ అనే మహిళకు ప్రతినిత్యం కొందరు మృగాళ్ల నుంచి వేధింపులు ఎదురవుతున్నాయి. గురువారం కూడా ఇంటి నుంచి కాలు బయటపెట్టిన ఆమెకు ఆ దుండగుల నుంచి వెకిలి మాటలు, చేష్టలు ఎదురయ్యాయి. భరించలేకపోయిన ఆమె నేరుగా వాళ్ల వద్దకు వెళ్లింది. ఇదేంటని ప్రశ్నించింది. దీంతో ఒంటరిగా ఉన్న ఆమెను సమీపంలో ఉన్న కరెంటు స్తంభానికి ఆ దుర్మార్గులు కట్టేశారు.

సహాయం కోసం ఆమె గట్టిగా కేకలు వేసింది. ఆమె ఆర్తనాదాలు విని పరుగున అక్కడకు చేరుకున్న స్థానికులు ఆమెను విడిపించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కళ ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు శశి(45), జయకాంత్(37), వినోద్(44) అనే ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి పోలీసులు గాలిస్తున్నారు. సమీపంలో ఉన్న సిసిటివి ఫుటేజ్ ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News