ఇక కరోనా రహిత కలలు కనొచ్చు
ప్రపంచ ఆరోగ్య సంస్థ అధినేత ఆశాభావం
న్యూయార్క్: కరోనా మహమ్మారి అంతం గురించి ఇక ప్రపంచ ప్రజలు కలలు కనొచ్చు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధినేత టెడ్రోస్ అధనామ్ గెబ్రెయెసస్ చెప్పారు. ఇప్పుడిప్పుడే ప్రపంచవ్యాప్తంగా కొన్ని కరోనా వ్యాక్సిన్లు వస్తున్నాయి. వీటి ఫలితాలు బాగా ఉన్నాయని, ఇది ప్రపంచం నుంచి క్రమేపీ కరోనాను పారదొలేందుకు దారితీస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా అంతం గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ సానకూల స్పందన వెలువరించడం ఇదే తొలిసారి. కరోనా వైరస్పై తొట్టతొలి అత్యున్నత స్థాయిలో జరిగిన ఐరాస సర్వప్రతినిధి సభలో ఆయన మాట్లాడారు. ఏదో విధంగా ప్రస్తుత వ్యాక్సిన్లతో ఇతరత్రా చర్యలతో కరోనా వైరస్ నివారణ జరగవచ్చునని.. అయితే ఇంతటితో ఉదాసీనత పనికిరాదన్నారు. ఇక ముందు వెళ్లాల్సిన దారి ఇప్పటికీ ప్రమాదకారిగానే ఉందని హెచ్చరించారు. ఇప్పటివరకూ ఈ మహమ్మారి నుంచి విరుగుడుపై నిరాశజనకమైన పరిస్థితి ఉంటూ వచ్చిందని, అయితే ఇప్పుడు వ్యాక్సిన్ ట్రయల్స్ సరికొత్త ఆశలను రేకెత్తించాయని తెలిపారు. వచ్చి తిష్ట వేసుకున్న ఈ వైరస్ మానవాళికి తనదైన రీతిలో చుక్కలు చూపించిందని, బిక్కుబిక్కు మనేలా మార్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఇదే క్రమంలో దారుణమైన రీతిలో అయినా ఈ వైరస్ తన ఔదార్యాన్ని చాటుకున్నట్లుగా ఉందని, సహనం, త్యాగం, శాస్త్రీయ ఆవిష్కరణలలో అపూర్వ ఆవిష్కరణం వంటి పలు ప్రక్రియలకు దారి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. పలువురు సాగించిన సృజనాత్మక పరిశోధనలతో, హృదయాలను హతుక్కునే సంఘీభావపు వ్యక్తీకరణలతో ప్రపంచం ముంగిట్లో ఇంతకు ముందు ఎప్పుడూ లేని సరికొత్త వాతావరణం నెలకొందన్నారు.
అయితే వైరస్ వచ్చిపడ్డ కలవరపు పరిణామాలూ తలెత్తాయి. సంఘీభావాన్ని దెబ్బతీసే విధంగా విభజన రేఖలు నెలకొన్నాయి. ఓ వైపు త్యాగాలకు దిగిన మానవాళి ఇదే దశలో సొంతం స్వార్థం అనే కోణాలతో రూపం ఎత్తిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వైపు వైరస్ విజృంభణ సాగుతూ ఉన్నదశలోనే ఆంతరంగికంగా మరో విధమైన నష్టదాయకపు వైరస్ వ్యాప్తి అయిందని అన్నారు. జనరల్ అసెంబ్లీ అత్యున్నత స్థాయి సదస్సు వీడియో కాన్ఫరెన్స్ ప్రక్రియలోనే సాగింది. సైన్సును కించపర్చే విధంగా వైరస్పై తలెత్తిన కుట్ర సిద్ధాంతాలు, పరస్పర ఆరోపణలు వంటివి చివరికి విభజన వాతావరణానికి దారితీశాయని తెలిపారు. కరోనా వ్యాక్సిన్ల గురించి తెలియచేస్తూ సంవత్సరాంతంలో ఇప్పటికైనా మూసుకుపోయింద నుకుంటున్న సొరంగ మార్గం వంటి దారిలో ఓ ఆశాకిరణం తళుక్కుమందని, ఇది క్రమేపీ దైదీప్యమానం అవుతోందని చెప్పారు. వ్యాక్సిన్లు రావడం సమర్థతను చాటుకోవడం మంచి పరిణామం అవుతుందని, అయితే ప్రపంచవ్యాప్తంగా దీనిని సమతూకతతో అందించాల్సి ఉంటుందని, దీనిని ప్రపంచ అత్యవసర సరుకుగా భావించుకుని తీరాలి. అంతేకానీ దీనిని కేవలం ప్రైవేటు సంస్థలకు చెందిన ఆస్తిగా భావించుకుంటే ఫలితం వేరే విధంగా ఉంటుందన్నారు. ప్రైవేటు సరుకుగా ఈ వ్యాక్సిన్ రావడం జరిగితే ఇది ఇప్పటికే ఈ వైరస్ దశలో తలెత్త ఉన్న పలు రకాల అసమానతలను మరింత పెంచి అగాధమయం చేస్తుందని హెచ్చరించారు.
World Can Start Dreaming of Covid End: WHO Chief