Friday, April 26, 2024

కరోనా నేర్పిన పర్యావరణ పాఠం

- Advertisement -
- Advertisement -

world environment day 2020

ప్రపంచ వ్యాప్తంగా విరుచుకుపడిన కరోనా మహమ్మారి వైద్య పరంగా అప్రమత్తతో పా టు, పర్యావరణ పరంగా మానవజాతి మనుగడను మరోసారి గుర్తు చేసింది. వ్యక్తిగత పరిశుభ్రత, భౌతిక దూరం పాటించడం లాంటి అంశాలు ముందు నుంచి మన సమాజాల్లో ఉన్నాయి. కానీ కాలానుగుణమైన వేగం, అభివృద్ది మాటున అవి మరుగున పడిపోయాయి. ఇప్పుడు విజృభించిన కరోనా ఆ విషయాలతో పాటు పర్యావరణ పరంగా మన బాధ్యతారాహిత్యాన్ని కూడా గుర్తు చేసింది. ప్రపంచీకరణ, పట్టణీకరణ వేగంలో పడిన మానవ జాతి తన మనుగడనే ప్రశ్నార్థకం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. భూమి, అడవులు, పర్యావరణ పరంగా ఉండాల్సిన కనీస సృహను మనం కోల్పోయాము. అందుకే చైనాలో పుట్టిందని చెబుతున్న కరోనా ప్రపంచమంతా చాలా త్వరగా పాకేసింది.

చందమామపైకి వెళ్తాను అంటూ నింగికి నిచ్చెనలు వేస్తున్న మానవాళిని ఒక్క సారిగా భూమికి దింపేసింది కరోనా. అనంత విశ్యంలో ప్రకృతికి మన అవసరం లేదు. కానీ ఆ ప్రకృతి, వాతావరణ సమతుల్యత మానవ మనుగడకు అవసరం. ఈ అవగాహన మరిచిన మనం అభివృద్ధి, పోటీతత్వమే ప్రధానమన్నట్లు దూసుకుపోతున్నాం. ప్రధానంగా అభివద్ధి చెందిన దేశాలు కొత్త ఆవిష్కరణలు చేస్తూ, జీవనాన్ని మరింత సుఖవంతం చేస్తున్నామనే భ్రమలను కలిగిస్తున్నాయి. కానీ దాని మాటున ఎంతటి పర్యావరణ హాని జరుగుతుందో తెలిసీ నిర్లక్షం చేస్తున్నాం. అన్ని రకాలుగా అభివృద్ధి అవసరమే, దాని కోసం ఎలాంటి ఆవిష్కరణ అయినా ఆహ్వానించాల్సిందే. కానీ అభివృద్ధి కోసం పర్యావరణ వనరులను పణంగా పెట్టడం, లెక్క లేకుండా సహజ వనరులను వాడేయటం, తోడేయటం కూర్చొన్న కొమ్మను నరుక్కోవటమే. పర్యావరణపరంగా సుస్థిరమైన అభివృద్ది నినాదం (sustainable development) అనేది చెప్పుకునేందుకే మిగిలింది.

నింగీ, నేలా మధ్య ఉన్న అన్ని వనరులను, జంతు జాలాన్ని మన అవసరాల కోసం విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తున్నాం. కానీ మనిషి కంటే ముందే అవన్నీ ఉన్నాయని, ఇక ముందు కూడా ఉంటాయనే సత్యాన్ని మానవలోకం మరిచిందనే వాదనలు ఉన్నాయి. ఆకులు అలములు తింటూ ఆది మానవుడు వేట నేర్చుకున్నాడని, తాను మరింత సౌక్యంగా ఉండేందుకు క్రమంగా ప్రకృతిలోని వనరులను వాడుకున్నాడనేది మనకు తెలిసిన నిజం. కానీ పరిమాణ క్రమంలో వేగాన్ని అందుకున్న ఈ పర్యావరణ దోపిడీకి అంతూ అదుపూ లేకుండా పోయింది. ప్రకృతిని, వనరులను పణంగా పెట్టిన దేశాలే నేటి సమాజంలో అభివృద్ధి చెందిన దేశాలుగా గుర్తింపు పొందాయి. ఓ వైపు వనరులను విచ్చలవిడిగా వాడుతూ, మరోవైపు ప్రకృతికి హానికరమైన కర్బన ఉద్గారాలను ఎక్కువ స్థాయిలో వదులుతున్న దేశాలు కూడా అభివృద్ధి చెందినవే.

ఓజోన్ పొర పరిధి తగ్గిపోవటం, అంటార్కిటికాలో మంచు కరగటం, అడవులు అంతరించటం, వాతావరణ మార్పులు (climate change), పెరిగిన భూతాపం, భూకంపాలు, సునామీలు, తుఫాన్లు, వరదలు ఇవన్నీ కూడా పర్యావరణపరంగా మనం ఎదుర్కొంటున్న సవాళ్లు. ఇప్పుడు వీటికి తోడు కరోనా వైరస్ లాంటి కంటికి కనిపించని శత్రువులు మానవ జాతికి అతి పెద్ద సవాల్‌ను విసురుతున్నాయి. నివాసయోగ్యమైన భూమండలాన్ని అత్యంత సౌకర్యంగా మార్చుకోవటం కోసమంటూ స్వార్థంతో పర్యావరణ దోపిడీ పెరిగిపోయింది. అడవులు, ప్రకృతితో సహజీవనం చేయాల్సిన మనిషి వాటిని ధ్వంసం చేసి, ఆ పరిణామాల మూలంగా దాపురించిన కరోనాతో సహజీవనం చేస్తామంటూ సర్ది చెప్పుకుంటున్నాడు. విచక్షణారహితంగా జరిగిన ప్రకృతి విధ్యంసం ఒక ఎత్తు అయితే, చివరకు అన్ని రకాల జంతువులు, కీటకాలను కూడా మానవ భక్షణకు వాడేయటం ఈ తాజా కరోనా విపత్తుకు కారణమనే వాదనలు ఉన్నాయి.

అభివృద్ధి పేరుతో మనిషి సృష్టించిన ఆవిష్కరణలే ఇప్పుడు అదే మానవులు వాడాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. తోటి వారిని, తోడబుట్టిన వారిని కూడా దగ్గితే, తుమ్మితే అనుమానంగా చూసి దూరం జరుగుతున్నాం. భౌతికి దూరం పేరుతో అందరికీ దూరం అవుతున్నాం. రెక్కలు కట్టుకుని విమానాల్లో విహరించిన మనం ఆ విహంగాలనే నెలల తరబడి షెడ్డుల్లో పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది. బతికి ఉంటే అదే పదివేలు అన్నట్లు పేద వలస కార్మికుడు సొంతూరుకు వందల కిలోమీటర్లు నడిచి వెళ్తున్నారు. అవసరం ఉన్నా లేకున్నా విచ్చలవిడిగా తిరిగి, తిని, తాగి ఎంజాయ్ చేసిన మనిషి ఇప్పుడు ఏం తినాలన్నా, తాగాలన్నా ఒకటికి వంద సార్లు ఆలోచిస్తున్నాడు. బతికుంటే బలుసాకుతినొచ్చు అని ఉపవాసానికీ సిద్ధపడుతున్నాడు. మూతికి మాస్క్, చేతికి శానిటైజర్, పరస్పర భౌతిక దూరం ఇప్పుడివే మనల్ని కాపాడేవి. అయితే ఇవేవీ కొత్త విషయాలు కాదు.

తినేముందు, ఆ తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవటం, దగ్గినా,తుమ్మినా చేతులో, తువ్వాలో అడ్డుపెట్టుకోవటం మన సంప్రదాయం. అలాగే ఏదైనా వ్యాధి ఉన్నవాళ్లకు కాస్త దూరంగా ఉండటమూ మన సమాజంలో ఉంది. వీటిని పాటించకుండా, పాశ్చాత్య సంస్కృతి మోజులో పడటం మన కొంప ముంచింది. అదే స్థాయిలో పర్యావరణ హననం మన పీకల మీదకు తెచ్చింది. మనకంటే ముందే ఉన్న ప్రకృతిని విధ్యంసం చేయటం, విచక్షణలేని జంతు, కీటకాల భక్షణ ఇప్పుడు మన జీవన విధానాన్నే మార్చింది. అందుకే అతి సర్వత్రా వర్జేయత్ అని పెద్దలు ఊరికే చెప్పలేదు. నిప్పులు చిమ్ముకుంటూ నింగికి ఎగిసిన మనం ఇప్పుడు అంతే వేగంగా నేలనపడ్డాం. కరోనా ఉపద్రవమే ప్రమాదకరం అనుకుంటే, మరోవైపు మిడతల దాడి దూసుకు వస్తోంది.

(ప్రస్తుతానికి తెలంగాణకు ప్రమాదం లేదని సమాచారం) వీటికి తోడు అతివృష్టి, అనావృష్టిలు ఉండనే ఉన్నాయి. చెట్ల నీడన సేద తీరాల్సిన మనం ఆ చెట్టునే కొట్టేసి చోద్యం చూస్తున్నాం. స్వచ్ఛమైన గాలిని గుండెల నిండా పీల్చాల్సిన మనం ఇప్పుడు ఆక్సిజన్ చాంబర్ల గురించి ఆసక్తిగా మాట్లాడుకుంటున్నాం. ప్రపంచ వ్యాప్తంగా వేగం, అభివృద్ధిలపైనే ఇన్నాళ్లూ చర్చ. కానీ ఇప్పుడు అది మారొచ్చు. పర్యావరణపరంగా స్థిరమైన అభివృద్ధి ఎలా, కనిపించని వైరస్‌లతో కంటే, కనిపించే ప్రకృతితోనే సహజీవనం చేయాలన్న మార్పు మనందరిలో రావాలి. ఆ దిశగా ప్రతి ఒక్కరి ఆలోచనా సరళి మారాలి. బతుకు బతికించు నినాదమే (లివ్ అండ్ లెట్ లివ్) శ్రీరామరక్ష.

శ్రీకాంత్ బాబు బందు (ప్రజా సంబంధాల అధికారి, తెలంగాణ అటవీశాఖ)- 9848423770

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News