Saturday, April 20, 2024

అద్భుత శిల్పకళగా…. యాదాద్రి

- Advertisement -
- Advertisement -

యాదాద్రి ఆలయాన్ని సిద్ధం చేయండి
ఉత్తరాయణం.. మే నెలలో ప్రారంభించుకుందాం

భక్తుడికి దివ్య దర్శనం కలిగేలా
క్యూ లైన్లు ఏర్పాటు చేయాలి
యాదాద్రిలో జరుగుతున్న పనుల పరిశీలన
దేశంలోని ఆలయాలకు ఆదర్శంగా ఉండాలి
రోడ్డు బాధితులకు హర్షించేలా వరాలు
ఆలయ పర్యటనలో ముఖ్యమంత్రి కెసిఆర్

Yadadri temple story in telugu

యాదాద్రి ఆలయ నిర్మాణ పనులు 90 శాతానికిపైగా పూర్తవడం పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఐదున్నర గంటల పాటు పర్యటించిన సిఎం… నెలలో యాదాద్రి ఆలయం పునఃప్రారంభించే అవకాశముందని ప్రకటించారు. వచ్చిన భక్తులు వైకుంఠ పుణ్యక్షేత్రంలోకి వచ్చిన అనుభూతి కలిగేలా తుది మెరుగులు దిద్దాలని సూచించారు. ఆలయాలకు ఆదర్శంగా యాదాద్రి వుండాలని… విరాట్టు స్వామి సేవలు దూరం నుంచి చూసినా స్పష్టంగా కనిపించేలా వుండాలన్నారు.

మనతెలంగాణ/ భువనగిరి ప్రతినిధి/యాదాద్రి : దివ్య క్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా తుది మెరుగులతో తీర్చి దిద్దుతుంటే ఉత్తరాయణంలో మే మాసంలో పునర్ ప్రారంభించుకునే అవకశాముందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. యాదాద్రి పునర్ నిర్మాణ పనులను దాదాపు పూర్తి కావొస్తున్న నేపథ్యంలో గురువారం ముఖ్యమంత్రి కెసిఆర్ యాదాద్రి క్షేత్ర పనుల పరిశీలనపై పర్యటన సుమారు 6 గంటల పాటు కొనసాగించారు. మధ్యాహ్నం 12:08 నిమిషాలకు యాదాద్రి పెద్దగుట్ట పైకి చేరుకున్న సిఎం సాయంత్రం 6 గంటలకు తిరిగి ప్రయాణం చేసేంత వరకు ఆలయ అభివృధ్ధి పనులను అంతా తానై పర్యావేక్షించి పలు సూచనలు తెలిపారు. ప్రధాన గర్భాలయ పనులను సుమారు గంట సేపు ఆలయ ప్రాంగణంతో పాటు ఆలయం చుట్టూ ప్రక్కల అనుబంధంగా జరుగుతున్న పనులను, పురోగతిని క్షుణ్ణంగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆలయ పునర్ నిర్మాణ పనులు పూర్తి కావొస్తున్న నేపథ్యంలో ఇంకా అసంపూర్తిగా ఉన్న పనులు వెంటనే పూర్తి చేసే విధంగా అధికారులను ఆదేశించారు. ప్రధానాలయం ప్రాంగణంలో కలియ తిరిగిన సీఎం కేసీఆర్ మాఢవీధులు, క్యూ లైన్లు, ప్రాకార మండపాలు, దర్శన సముదాయాలను, బ్రహ్మోత్సవ మండపం, అద్దాల మేడ, తూర్పు రాజగోపురం వద్ద క్యూ లైన్లు, శివాలయ నిర్మాణం పురోగతి, స్వామి పుష్కరణీ, స్నాన గుండం, మెట్లదారి నిర్మాణం పరిశీలన సాగించి మెరుగైన రీతిలో తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి సూచనలు చేశారు. ఆలయం చుట్టూ ప్రహారికి మరింత శోభనిచ్చేలా ప్రాచీన చిత్రకళ ఉట్టిపడేలా అలంకృత రూపంతో ఉండేలా బ్రాస్ మెటీరియల్‌తో సుందరంగా తయారు చేయాలన్నారు. ఆలయాన్ని దూరం నుంచి దర్శించుకునే భక్తులకు భక్తి భావాన్ని ఉట్టిపడేలా దీపాలంకరణ ఉండాలని స్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తులకు వైకుంఠంలో సంచరించే అనుభూతిని కలిగించాలని యాదాద్రి శిల సంపదను చూసేందుకు దేశం నలుమూలల నుండి వచ్చేలా తుది మెరుగులు దిద్దాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆలయ ఘట్టాలు, ప్రహ్లాద చరిత్ర, నారసింహుని చరిత్ర తెలియపరిచే పురానత దేవతల చరిత్రలు అర్థమయ్యేలా శిల్పాలతో ఆలయ ప్రాంగణంలో అలకంరించాలని అన్నారు. కొండ క్రింద నిర్మాణం చేపడుతున్నటువంటి బస్టాండు, పుష్కరణీ, అన్నదానం, కళ్యాణకట్ట, రోడ్డు విస్తరణ, రాష్ట్రపతి భవన్ పనులను ముఖ్యమంత్రి కలియతిరిగి పరిశీలన చేసి త్వరగా పనులు పూర్తయ్యేలా అధికారులను సూచించారు. అనుకున్న సమయంలో ఆలయ పనులు పూర్తి చేస్తే ఉత్తరాయణంలోని మే మాసంలో దివ్య ముహూర్తాలు ఉన్నాయని జ్యోతిష్య పండితులతో చర్చించి ఆలయం ప్రారంభించుకునే అవకాశముంటుందని పనులు వేగవంతం ఉందని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పర్యటనలో ఆయన వెంట రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్, ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీత, మానవ హక్కుల కమిషన్ చైర్మెన్ చంద్రయ్య, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, జడ్పీ చైర్మెన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, డీసీసీబీ చైర్మెన్, రాష్ట్ర టెస్కాబ్ వైస్ చైర్మెన్ గొంగిడి మహేందర్‌రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, సీఎంవో భూపాల్‌రెడ్డి, వైటీడీఏ వైస్ చైర్మెన్ కిషన్‌రావు, ఈవో గీతా, ఆర్‌ఆండ్‌బీ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ, ఈఎన్‌సీలు గణపతిరెడ్డి, రవీందర్‌రావు, ఆర్కిటెక్చర్ ఆనంద్‌సాయి, స్తపతి వేలు, వాస్తు సలహాదారులు సుధ్ధాల సుధాకర్‌తేజ, స్థానిక ప్రజా ప్రతినిధులు, వైటీడీఏ, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
భక్తుడికి దైవ దర్శనం.. దివ్య అనుభూతి కలగాలి
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహున్ని దర్శించుకునే భక్తుడికి స్వామి వారి దర్శనం దివ్య అనుభూతిగా మిగిలేలా దర్శనం కల్పించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపారు. ప్రధానాలయంలో పనులు పరిశీలించిన ఆయన దర్శన క్యూలైన్లను పరిశీలించి భక్తుడు వెళ్ళే క్యూ లైన్లలో స్వామి వారి దర్శనం దివ్యంగా కనబడాలని అందుకు అనుకూలంగా క్యూ లైన్లను ఏర్పాటు చేయాలని ప్రస్తుతం ఏర్పాటు చేసిన క్యూ లైన్లను మార్చాలని ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. తిరుమల వెంకటేశ్వర స్వామిని దూరం నుంచి దర్శించుకునే భక్తులకు భగవంతుని దర్శనం ఎలా కనబడుతుందో యాదాద్రి నారసింహుని దర్శనం కూడా భక్తులకు అదే విధంగా కనబడే విధంగా దర్శన క్యూలైన్లు ఉండాలని ముఖ్యమంత్రి సూచించినట్లు తెలుస్తోంది.
రోడ్డు బాధితులు హర్షించేలా వరాలు
యాదాద్రి అభివృధ్ధిలో కొనసాగుతున్న రోడ్డు విస్తరణలో భాగంగా పట్టణ రహదారి పాతగుట్ట చౌరస్తా నుండి సింహ ద్వారం వరకు చేపడుతున్నటువంటి రోడ్డు విస్తరణ బాధితులకు హర్షించే వరాలను ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. ఆలయ అభివృధ్ధి పనుల పరిశీలనలో భాగంగా కొండ క్రింద బస్టాండు స్థలం పరిశీలనలో సుమారు గంట సేపు రోడ్డు బాధితులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. బాధితుల అభిప్రాయాలు తీసుకున్న ముఖ్యమంత్రి ఆలయ అభివృధ్ధి పనులను పురోగతిని తెలియచేసి రోడ్డు విస్తరణలో నష్టపోతున్న బాధితులకు నష్ట పరిహారాన్ని ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణం కోసం 200 గజాల స్థలం కేటాయింపు, టెంపుల్ సిటీ పరిధిలో 1000 స్కైర్ ఫీట్ దుకాణ సముదాయాన్ని నిర్మాణం చేసి ఇవ్వడం జరగుతుందని ముఖ్యమంత్రి తెలపడంతో రోడ్డు బాధితులు హర్షించి రోడ్డు విస్తరణకు అంగీకరించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన వరాలతో రోడ్డు బాధితులు సీఎం చిత్ర పటానికి క్షీరాభిషేకం నిర్వహించి హర్షం వ్యక్తం చేశారు.
బాలాలయంలో ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు
యాదాద్రి అభివృధ్ధి పనుల పరిశీలన పర్యటన సాగించిన ముఖ్యమంత్రి కేసీఆర్ స్వామి వారి బాలాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం 12 ః 19 నిమిషాలకు కొండపైకి చేరుకున్న ముఖ్యమంత్రికి ఆలయ అర్చకులు సాంప్రదాయబధ్ధంగా బాలాలయంలోకి ఆహ్వానించగా 12 ః 25 నిమిషాలకు బాలాలయంలోకి వెళ్ళిన ముఖ్యమంత్రి 12 ః 39 నిమిషాల వరకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆలయ అర్చకులు స్వామి వారి ఆశీర్వచనాన్ని ముఖ్యమంత్రికి అందచేశారు.
ముఖ్యమంత్రి పర్యటన కొనసాగిందిలా
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలయ అభివృధ్ధి పనుల పరిశీలనలో హెలిక్యాఫ్టర్ ద్వారా యాదాద్రికి చేరుకున్న ముఖ్యమంత్రి 12:08 నిమిషాలకు పెద్దగుట్టపై దిగారు. 12:14 నిమిషాలకు పెద్దగుట్ట నుండి కాన్వాయ్ ద్వారా యాదాద్రికి బయల్దేరి 12:19 నిమిషాలకు కొండపైకి చేరుకున్నారు. 12 ః 24 నిమిషాల నుండి 12:39 నిమిషాల వరకు బాలాలయంలో లక్ష్మీనరసింహున్ని దర్శించుకొని 12:44 నిమిషాలకు ప్రధానాలయానికి చేరుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని క్యూ లైన్లు బ్రహ్మోత్సవ మండపం, దక్షిణ ప్రాకారం, కొండ క్రింది గార్డెన్ పరిశీలించి 1:00 గంటలకు ప్రధానాలయంలోకి వెళ్ళి సుమారు గంట సేపు ప్రధానాలయ పనులు పరిశీలించి అర్చకులతో చర్చించిన అనంతరం పడమర వీధి నుండి 1 :55 నిమిషాలకు ప్రధానాలయం నుండి బయటకు వచ్చిన ముఖ్యమంత్రి 1:55 నిమిషాలకు శివాలయంలోకి వెళ్ళి సుమారు 20 నిమిషాల పాటు ఆలయ పనులను పరిశీలించి పలు సూచనలు తెలిపిన ముఖ్యమంత్రి 2:16 ఆలయం నుండి బయటకి వచ్చారు. అక్కడి నుండి తిరిగి 2:23 నిమిషాలకు హరిత అతిథి గృహానికి చేరుకున్నారు. భోజనం అనంతరం తిరిగి కొండ క్రిందకి చేరుకున్న ముఖ్యమంత్రి పుష్కరణీ, బస్టాండు, రోడ్డు విస్తరణ, ప్రెసిడెంట్ షూట్ పనుల పరిశీలన అనంతరం 4:27 నిమిషాల నుండి సుమారు గంట సేపు రోడ్డు బాధితులతో సమావేశమయ్యారు. సమావేశం అనంతరం తిరిగి పెద్దగుట్టకు చేరుకున్న ముఖ్యమంత్రి 6:00 గంటలకు హెలిక్యాప్టర్ ద్వారా తిరుగు ప్రయాణం సాగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News