Friday, March 29, 2024

బాలీవుడ్‌ను అవమానించొద్దు: యష్

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: హిందీ చలనచిత్ర పరిశ్రమను 2022 సంవత్సరం తీవ్రంగా నిరాశ పరిచింది. ఒక్కటంటే ఒక్క సినిమా బాక్సాఫీసును షేక్ చేయలేకపోయింది. అక్షయ్ కుమార్, ఆమిర్ ఖాన్, రణబీర్ కపూర్ లఅఆంటి స్టార్ హీరోల చిత్రాలు సైతం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. బచ్చన్ పాండే, షంషేరా, లాల్ సింగ్ ఛద్దా వంటి అనేక భారీ బడ్జెట్ చిత్రాలు బాక్సాఫీసు ముందు బొక్కబోర్లాడపడ్డాయి. ఒకపక్క బాలీవుడ్ చిత్రాలు ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోగా దక్షిణాది చిత్రాలు మాత్రం పాన్ ఇండియా ప్రేక్షకుల ఆదరణకు నోచుకోవడం విశేషం.

దక్షిణాదిలో నిర్మాణమైన కెజిఎఫ్ రెండు భాగాలు, కాంతార, ఆర్‌ఆర్‌ఆర్, పుష్ప చిత్రాలు పాన్ ఇండియా చిత్రాలుగా ఉత్తరాది ప్రేక్షకుల ఆదరణ పొందడమేగాక వసూళ్ల వర్షాన్ని కురిపించాయి. ఈ పరిస్థితులలో బాలీవుడ్ ఇండస్ట్రీ మనుగడపై ప్రశ్నలు తలెత్తుతున్న వేళ కెజిఎఫ్‌తో స్టార్‌డమ్ సొంతం చేసుకున్న యష్ మాత్రం బాలీవుడ్‌ను అవమానించడం తగదంటూ దక్షిణాది సినీ ప్రేమికులకు సూచిస్తున్నారు.

ఇటీవల ఫిలిమ్ కంపానియన్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వూలో ఈ ఏడాది ఉత్తరాది రాష్ట్రాలలో దక్షిణాది చిత్రాలు బాగా ఆడినంత మాత్రాన బాలీవుడ్‌పై చిన్నచూపు ఏర్పర్చుకోవద్దని ప్రేక్షకులకు ఆయన సూచించారు. కాంతార, కెజిఎఫ్ చిత్రాల విజయాన్ని ప్రస్తావిస్తూ ఇదంతా ఒక దశ మాత్రమేనని, దీన్ని ఉదాహరణగా తీసుకుని బాలీవుడ్‌ను చిన్నచూపు చూడడం తగదని యష్ అన్నారు.

కన్నడ చిత్ర పరిశ్రమ కూడ ఇలాంటి దశనే ఎదుర్కొందని, గతంలో తమ చిత్రాలను కూడా చిన్నచూపు చూసేవారని ఆయన గుర్తు చేశారు. ఆ ముద్రను చెరిపేసుకుని గౌరవానన్ని పొందడానికి కన్నడ చిత్రపరిశ్రమ చాలా కష్టపడాల్సి వచ్చిందని, ఇప్పుడు లభిస్తున్న విజయాలు చూసి పొంగిపోవడం మాని మంచి చిత్రాల నిర్మాణం వైపు దృష్టి నిలపాల్సి ఉంటుందని ఆయన అన్నారు. గతంలో బాలీవుడ్ చిత్రాలే ఇతర భాషల చిత్రాలకు ఆదర్శంగా ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దక్షిణాది, ఉత్తరాది అంటూ సినిమాలను వేరుగా చూడడం మానుకోవాలని కూడా ఆయన ప్రేక్షకులకు పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News