Wednesday, April 24, 2024

ఎపిలో ఫ్యాన్ హవా

- Advertisement -
- Advertisement -

11 కార్పొరేషన్లు వైఎస్సార్ కైవసం
75 మున్సిపాలిటీల్లో 74 దక్కించుకున్న అధికార పార్టీ
ఒక్క మున్సిపాలిటికి పరిమితమైన టిడిపి
ఉనికి చాటుకున్న బిజెపి, జనసేన, వామపక్షాలు

మనతెలంగాణ/హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం కొనసాంగించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ‘ఫ్యాన్’ గాలి వీచింది. పట్టణాలు, నగరాల్లో ఓటెత్తి అధికార వైఎస్సార్ సీపీకి జనం జైకొట్టడంతో క్లీన్‌స్వీప్ చేసింది. మొత్తం 11 కార్పోరేషన్‌లలో 11 స్థానాలను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. అలాగే రాష్ట్రంలోని 75 మున్సిపాలిటీలలో 74 అధికార పార్టీ ఖాతలో చేరగా కేవలం ఒక్క మున్సిపాలిటీలో టిడిపి విజయం సాధించింది. ఏపీ చరిత్రలో ఇంతవరకు ఒకే పార్టీకి ప్రజలు పట్టం కట్టడం ఇదే తొలిసారి. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ప్రజలు జై కొట్టడంతో.. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ.. ఇలా మూడు ప్రాంతాల్లోనూ వైఎస్సార్ సీపీ ఆధిక్యం కొనసాగడం విశేషం. దీంతో మూడు రాజధానులకు ప్రజలు మద్దతిచ్చినట్లు స్పష్టమవుతోంది. ఇక ‘ఫ్యాన్’ గాలిలో కొట్టుకుపోయిన టీడీపీ కేవలం ఒక్క మునిసిపాలిటి కైవసం చేసుకోగా, బీజేపీ, జనసేన ఒకటిరెండు వార్డులు దక్కించుకుని చతికిలపడ్డాయి.కాగా టీడీపీ సీనియర్ నేతల జిల్లాల్లో ఆ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది.

ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సీనియర్ నేత అశోక్‌గజపతిరాజు(విజయనగరం), తునిలో యనమల రామకృష్ణుడికి, పెద్దాపురంలో నిమ్మకాయల చినరాజప్పకు, హిందూపురంలో బాలకృష్ణకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. సానుకూల దృక్పథంతో, సంక్షేమ పథకాలతో తమ హృదయాలను గెలుచుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే మరోసారి ప్రజలు పట్టం కట్టడంతో సరికొత్త రికార్డు దిశగా వైఎస్సార్ సీపీ దూసుకుపోతోంది. చిత్తూరు, తిరుపతి, కడప, ఒంగోలు, కర్నూలు, గుంటూరు తదితర 6 కార్పొరేషన్లను కైవసం చేసుకున్న వైఎస్సార్‌సీపీ… విశాఖపట్నం, మచిలీపట్నం, విజయవాడ కార్పొరేషన్లలోనూ ఆధిక్యం కనబరిచింది. దీంతో వైఎస్సార్ సీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్‌స్వీప్ చేసింది. టీడీపీ కంచుకోటలు బద్దలు కొడుతూ.. చిత్తూరు, తిరుపతి కార్పొరేషన్స్ విజయ ఢంకా మోగించింది. అదే విధంగా మదనపల్లి, పలమనేరు, పుత్తూరు, నగరి మున్సిపాలిటీల్లో జయకేతనం ఎగురవేసింది. 75 మున్సిపాలిటీల్లో కేవలం ఒక్క మున్సిపాలిటీకే టీడీపీ పరిమితం అయ్యింది.

YCP Party win 74 Municipalities in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News