సికింద్రాబాద్: నగరంలోని చిలకలగూడ పోలీస్స్టేషన్ పరిధిలోగల అంబర్నగర్లో యువ జంట ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరూ టిఎస్ ఎస్పిడిసిఎల్(ఎలక్ట్రిసిటి డిపార్ట్మెంట్)లో విధులు నిర్వహిస్తున్నారు. దంపతుల ఆత్మహత్యతో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమల వెంకటేష్(33), తిరుమల వాసవి(25) భార్యభర్తలు. వీరు టిఎస్ ఎస్పిడిసిఎల్లో ఉద్యోగం చేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు మోక్షశ్రీ(4), అన్విక్(4 నెలలు). దంపతులు మంగళవారం అంబర్నగర్లోని ఇంటిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
వెంకటేష్ బెడ్రూంలో ఫ్యాన్కు ఉరి వేసుకోగా, వాసవి బాత్రూంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో చిలకలగూడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టుం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు, ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. సిఐ బాలగంగిరెడ్డి ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు జరుగుతోంది. ఎలాంటి ఆర్థిక సమస్యలు లేకున్నా వెంకటేష్, వాసవి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో అర్థం కావడం లేదని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.