అనంతగిరిలో విషాదం
నెల క్రితమే ఆత్మహత్య
లోతుగా దర్యాప్తు చేస్తున్నాం : ఎస్పి నారాయణ
మనతెలంగాణ/ వికారాబాద్ జిల్లా : అనంతగిరి అడవిలో ఓ యువ జంట ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. వికారాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న అనంతగిరి అడవిలో జైదుపల్లి సమీపంలో గల పెద్ద లొద్దిలో యువ జంట చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం వెలుగు చూసింది. మృతదేహాలు పూర్తిగా కుళ్లిపోయాయి. తలలు మాత్రమే చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. ఈ జంట ఆత్మహత్యలపై శనివారం పోలీసులకు సమాచారం అందగానే ఎస్పి ఆదేశాల మేరకు ధారూర్ సిఐ రాజశేఖర్, వికారాబాద్ సిఐ శ్రీనివాస్రావులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటనా స్థలంలో ద్విచక్ర వాహనం TS 34 C 1952, మొబైల్ ఫోన్లు ఉన్నాయి.
ద్విచక్ర వాహనంపై మోక్ష అని రాసి ఉంది. సంఘటనా స్థలాన్ని ఎస్పి నారాయణ కూడా పరిశీలించారు. ఆత్మహత్య చేసుకున్నట్టు భావిస్తున్న ఇద్దరు వ్యక్తులు కోట్పల్లి మండలానికి చెందిన వారిగా గుర్తించామని, మృతుడు మహేందర్ (30) కోట్పల్లి గ్రామానికి చెందినవాడు కాగా, మృతురాలు యువతి (22) ఇందోల్ గ్రామానికి చెందిన యువతి అని, ఏప్రిల్ 5న కోట్పల్లి పోలీస్ స్టేషన్లో వీరి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేశామని ఎస్పి తెలిపారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో లోతైన దర్యాప్తు చేయనున్నట్లు ఎస్పి తెలిపారు. వీరిది ఆత్మహత్యా లేక ఎవరైనా హత్య చేసి చెట్టుకు వేలాడదీశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. వీలయినంత త్వరగా జంట ఆత్మహత్యలకు గల కారణాలను ఛేదిస్తామని ఆయన వెల్లడించారు.