మన తెలంగాణ/హాలియా : పాల వ్యాపారం చేసే యువకుడు శిరసనగండ్ల రేవంత్కుమార్ (22)పై కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేసిన సంఘటన బుధవారం తెల్లవారుజామున హాలియా మున్సిపాలిటీ పరిధిలోని హజారిగూడెం స్టేజీ వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… మృతుడు రేవంత్కుమార్ తండ్రి శిరసనగండ్ల శ్రీనివాస్ స్కూల్ బస్సు డ్రైవర్గా, తల్లి ఇందిరమ్మ పాల వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి ఏకైక కుమారుడైన శిరసనగండ్ల రేవంత్కుమార్ తల్లితో పాటు పాలు సేకరించి హాలియాలో విక్రయిస్తుంటాడు. అదే క్రమంలో బుధవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో నాయుడుపాలెం గ్రామానికి పాల కోసం రేవంత్ కుమార్ వెళుతుండగా హజారిగూడెం స్టేజీ సమీపంలో అప్పటికే మాటు వేసిన దుండగులు కత్తులతో దాడి చేసి పరారయ్యారు. అతని తల్లిదండ్రులు వచ్చే వరకే రేవంత్కుమార్ మృతి చెందాడు.
ఘటనాస్థలిని డిఎస్పి వెంకటేశ్వరరావు, సిఐ చంద్రశేఖర్, ఎస్ఐ వీరరాఘవులు పరిశీలించారు. డాగ్ స్కాడ్ను రప్పించి పరిశీలించారు. హజారిగూడెం గ్రామానికి చెందిన హరి, సత్యనారాయణలే తన కొడుకు రేవంత్ను హత్య చేశారని ఆయన తండ్రి శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రేవంత్కుమార్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం హాలియాలోని అంత్యక్రియలు పూర్తి చేశారు. ఉన్న ఒక్క కొడుకు హత్యకు గురి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. రేవంత్ హత్యకు పాత కక్షలు కారణమా, అక్రమ సంబంధం కారణమా అనే కోణంలో విచారణ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
young man brutally murdered in nalgonda district