మనతెలంగాణ/ సదాశివనగర్: పెళ్లి కావడం లేదని బెంగతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని కుప్రియాల్ గ్రామంలో బుదవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుప్రియాల్ గ్రామానికి చెందిన రైతు గడ్డం భూపతిరెడ్డికు ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు గడ్డం రమేష్ పెళ్లి కాగా చిన్న కొడుకు గడ్డం సుధాకర్రెడ్డి (35) ఇంకా పెళ్లి కాలేదు. సంబంధాలు రావడం లేదు దీంతో తనకు ఇంకా పెళ్లి కాదేమోనని బెంగతో మనస్తాపానికి గురై ఆత్మ హత్యకు పాల్పడ్డారన్నారు. ఈ నెల 14న పొలానికి వెళ్లి రాత్రి అక్కడే పడుకుంటానని ఫోన్ లో చెప్పాడు. ఉదయం వరకు రాకపోవడంతో పొలం వద్ద వెతికినా అతడి ఆచూకీ లేకపోవడంతో బంధువులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. మానసికంగా బాధపడుతన్న సుధాకర్రెడ్డి గతంలో ఇల్లు వదిలి వెళ్లిపోయి కొన్ని రోజులకు తిరిగి వచ్చాడని, అలాగే వెళ్లి ఉంటాడని భావించామని రాకకోసం ఎదురు చూస్తుండగా బావిలో శవం లభించిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. సదా శివనగర్ ఎస్ఐ జగడం నరేష్ సిబ్బందితో గ్రామానికి చేరుకొని… సుధాకర్ తండ్రి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సుధాకర్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవ పరీహక్ష నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు సదాశివనగర్ ఎస్సై జగడం నరేష్ వివరించారు.