మనతెలంగాణ/భూదాన్పోచంపల్లి: కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లడంతో ఓ యువకుడు మృతిచెందిన సంఘంటన గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచం పల్లి మండలంలోని జలాల్పూర్ వద్ద జరిగింది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం… హైదరాబాద్ లోని ఎల్బీనగర్కు చెందిన జింక వంశీ (20) గురువారం రాత్రి ముగ్గురు స్నేహితులతో కలిసి మండలంలోని రామలింగంపల్లిలో గల బంధువుల ఇంటికి బయలుదేరాడు. కాగా జలాల్పూర్ చెర్వుకట్ట మలుపు వద్ద వారు ప్రయాణిస్తున కారు అదుపుతప్పి చెర్వులో పడి తలక్రిందులై నీటిలో మునిగిపోయింది. సీటుబెల్టు పెట్టుకుని ఉండడంతో డ్రైవింగ్ చేస్తున్న వంశీ కారులోని ఇరుక్కపోయి మృతి చెందాడు. అతని స్నేహితులు స్వల్ప గాయాలతో కారులోనుండి బయటపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఎస్ఐ సైదిరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించి కేసునమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు తెలిపారు.