పంజగుట్ట: రోడ్డు దాటుతున్న యువతిని ద్విచక్రవాహనంతో పాటు కారు ఢీకొన్న ఘటనలో ఆమెకు తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ఘటన ఈనెల 14న చోటు చేసుకుంది. పోలీసులకు బాధితురాలి సోదరుడు నవీన్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం … ఎస్ఆర్నగర్లోని సత్యం థియేటర్ వద్ద గల గురుద్వారా ఎదురుగా ఉన్న డెజీమీ లేడీస్ హాస్టల్లో ఉంటున్న అలేఖ్య(23) ఈనెల 14వ తేది మధ్యాహ్నం సమయంలో ప్రైమ్ హస్పిటల్ ముందు నుంచి మైత్రీ వనంకు వెళుతుండగా ద్విచక్ర వాహనం ఢీకొంది. దీంతో అలేఖ్య ఎడమ వైపుకు పడిపోగా అటు పక్కనుంచి వేగంగా వచ్చిన కారు కూడా ఆమెను ఢీకొట్టింది. అలేఖ్యను కారు సుమారు 50 అడుగుల వరకు ఈడ్చుకుంటూ వెళ్లింది. వెంటనే స్పందించిన స్థానికులు కారు కింద పడ్డ అలేఖ్యను రక్షించారు. స్థానికంగా ఉన్న ప్రైమ్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో అలేఖ్యకు నడుము ఎముకలు విరిగిపోయినట్లు వైద్యులు తెలిపారు. అలేఖ్య సోదరుడు నవీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.