మన తెలంగాణ/చర్ల: పొట్టకూటి కోసం అటవీకి వెళ్లిన యువతి తిరిగిరాని లోకాలకు వెళ్లిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలోని మారుమూల అటవీ ప్రాంతమైన పూసుగుప్ప గ్రామంలో చోటుచేసుకుంది. మృతురాలి తల్లిదండ్రుల కథనం మేరకు… పూసుగుప్ప గ్రామానికి చెందిన సోడి గణపతి, నర్సిల కుమార్తె సోడి కవిత(17) ప్రతిరోజు లాగే గురువారం కూడా ఇప్పపూల సేకరణకు తమ ఇంటి సమీపంలో ఉన్న ఇప్ప చెట్ల వైపు వెళ్లింది. ఇప్పపూలు సేకరిస్తున్న సమయంలో అటవీ ప్రాంతం నుండి ఒక్కసారిగా వచ్చిన అడవి పంది కవితపై దాడి చేసింది. ఈ దాడిలో కవిత తీవ్రగాయలపాలైంది. ఇది గమనించిన గ్రామస్తులు ఆమెను హుటాహుటిన చర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే కవిత మృతి చెందినట్లు తెలిపారు. ఇప్పపూల సేకరణకు వెళ్లిన బిడ్డ తిరిగిరాని లోకాలకు వెళ్లిందని తల్లిదండ్రులు రోధిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది.