లక్నో: ఓ వ్యక్తిని చెట్టుకు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టిన సంఘటన ఉత్తర ప్రదేశ్లోని ప్రతాప్గఢ్ జిల్లాలో చోటుచేసుకుంది. మహిళతో వివాహేతర సంబంధం ఉందని అనే అనుమానంతో అతడిని హత్య చేసినట్టు సమాచారం. దీంతో మృతుడు బంధువులు, గ్రామస్థులు రెండు పోలీస్ జీబులను తగలబెట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఫతాన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భుజౌన్ గ్రామంలో అంబిక పటేల్ ఇంట్లోకి కొందరు వ్యక్తులు చొరబడి పటేల్ను బయటకు లాక్కెళ్లారు. అనంతరం పటేల్ను చెట్టుకు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు.
అనంతరం నిందితులు ఘటనా స్థలం నుంచి పారిపోయారు. దీంతో అంబికా పటేల్ ఘటనా స్థలంలో చనిపోవడంతో బంధువులు, గ్రామస్థులు అల్లర్లు సృష్టించారు. రెండు వ్యాన్లలో పోలీసులు అక్కడికి చేరుకొని అల్లర్లను అదుపు చేయడానికి ప్రయత్నించారు. కోపంతో ఊగిపోయిన గ్రామస్థులు రెండు పోలీస్ వాహనాలను తగలబెట్టారు. పెద్ద మొత్తంలో పోలీసులు అక్కడికి చేరుకొని గ్రామానికి పహారా కాస్తున్నారు. గ్రామంలో ఓ మహిళకు సంబంధించిన వీడియోను పటేల్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. మహిళ కుటుంబం అతడిపై కేసు నమోదు చేయడంతో పటేల్ ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇటీవల అంబికా పటేల్ జైలు నుంచి విడుదలయ్యాడు. సదరు మహిళకు కానిస్టేబుల్ ఉద్యోగం రావడంతో కాన్పూర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ప్రతాప్గఢ్ జిల్లా ఎస్పి అభిషేక్ సింగ్ తెలిపాడు