Sunday, June 8, 2025

చచ్చేటంత అభిమానం దేనికి?

- Advertisement -
- Advertisement -

వినోదాన్ని విషాదంగా మారుస్తున్న సంఘటనలు దేశంలో తరచూ జరగడం ఇప్పుడు మనం చూస్తున్నాం. ముఖ్యంగా ప్రజలకు వినోదాన్ని అందించే సినిమా, క్రికెట్ రంగాలకు చెందిన నటులకోసం, క్రీడాకారులకోసం ప్రాణాలు పోగొట్టుకునే స్థితికి చేరుకుంటున్నారు అభిమానులు. ఇప్పుడు మతం, రాజకీయాలు, సినిమా, క్రికెట్.. ఈ నాలుగింటి చుట్టే ప్రపంచం తిరుగుతున్నట్టుగా కనిపిస్తుంది మనకు. జరుగుతున్న సంఘటనలు చూస్తే మితిమీరిన అభిమానం కారణంగా మతసంబంధమైన సభలు, రాజకీయ సభలు, సినిమా ఈవెంట్లు, క్రికెట్ మ్యాచ్‌ల కోసం జమగూడే ప్రజలు ప్రమాదాలకు గురికావడం, విలువైన ప్రాణాలు కోల్పోవడం, ఉజ్వల భవిష్యత్తును అర్ధంతరంగా ముగింప చేసుకోవడమే కాకుండా కుటుంబాలకు తీవ్ర దుఃఖాన్ని మిగులుస్తున్నారు.

మూడు రోజుల క్రితం బెంగళూరులో చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట సంఘటన చూసిన తర్వాత వీటిని అరికట్టవలసింది ఎవరు? జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఎవరు? పదేపదే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నా ముందు జాగ్రత్త చర్యలు లేకపోవడానికి కారకులెవరు? అన్న అంశాలమీద తీవ్రమైన చర్చ జరుగుతున్నది. ఈ సంవత్సరం ఆరంభంలోనే ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమం కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనలో అధికారికంగా మృతుల సంఖ్య 30గానే ప్రకటించినా ఇంకా చాలామంది చనిపోయి ఉంటారని పరిశీలకులు, మీడియా చెప్తున్న విషయం. కోట్లమంది పాల్గొనే ఇటువంటి కార్యక్రమంలో 30 మంది చనిపోతే విశేషమేముందని ఎవరైనా వాదించవచ్చు. కానీ, ఎవరూ అసహజ మరణానికి గురికాకూడదన్న స్పృహ లేనివారే అలా మాట్లాడతారు.
ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో గతంలో కూడా మనం తొక్కిసలాటలు, మరణాలకు సంబంధించిన వార్తలు విన్నాం. పదేళ్లక్రితం గోదావరి పుష్కరాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి రాష్ట్ర అధినేత ప్రచారంకోసం చేసిన ఆర్భాటం కారణంగా జరిగిన తొక్కిసలాటలో దాదాపు 30 మంది మరణించిన విషయం తెలిసిందే. రాజకీయ సభల్లోనూ జాగ్రత్తలు తీసుకోని కారణంగా జరిగిన విషాదాలు అనేకం.

పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఎన్నికలకు ముందు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అధినేత నెల్లూరు జిల్లాలోని కందుకూరు అనే చోట తన సభకు వచ్చిన జనం అధిక సంఖ్యలో కనిపించడం కోసం చేసుకున్న ఏర్పాట్ల కారణంగా జరిగిన తొక్కిసలాటలో ఎనిమిదిమంది మరణించారు. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకుని ముక్తి పొందాలనుకున్న భక్తులు టికెట్ల కోసం ఏర్పాటైన క్యూలో నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు చనిపోయారు. తాజాగా ఇంకా మన జ్ఞాపకాల్లోంచి తొలగిపోని సినిమా సంఘటన హైదరాబాద్‌లో జరిగింది. ఓ ప్రముఖ నటుడు తన సినిమా ప్రీమియర్ షోకు వెళ్తే, ఆయనను చూడడానికి ఎగబడిన అభిమానుల మధ్య జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందడం, మరొక బాలుడు గాయాలపాలై నెలల తరబడి స్పృహ లేకుండా ఆసుపత్రిలో పడి ఉండడం చూశాం. ఇప్పుడు ఐపిఎల్ విజేతలైన బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ఆటగాళ్ళను అభినందించడం కోసం బెంగళూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది చనిపోయారు. 11 మంది ఆడే క్రికెట్ ఆట ఓ 11మంది ప్రాణాలు తీయడానికి దారి తీసింది.

మత సంబంధమైన కార్యక్రమాల్లో గాని, రాజకీయ సభల్లో గాని, సినిమా ఫంక్షన్లలో గాని, క్రికెట్ స్టార్లను చూడడానికి ఎగబడిన జనసందోహంలో గానీ ప్రాణాలు కోల్పోతున్నవాళ్ళు ఎవరు? వాళ్ళను ఆయా సందర్భాలకు తగిన పేర్లతో పిలుచుకుంటాం. మత సంబంధమయిన కార్యక్రమాలలో పాల్గొంటే భక్తులని, రాజకీయ సభలయితే కార్యకర్తలు, ప్రజలు అని, సినిమా ఫంక్షన్లయితే ప్రేక్షక దేవుళ్ళు, క్రికెట్ ఆట చూడటానికి వెళితే క్రీడాభిమానులు అని. అయితే మొత్తంగా వీళ్లంతా మనుషులు. చదువుకుని పైకి రావలసిన వాళ్ళు, తమ కుటుంబాలకు ఆధారంగా ఉండవలసిన వాళ్ళు, ఎన్నో బాధ్యతలు మోస్తున్నవాళ్ళు అయి ఉంటారు.

ఎందుకు ఇది రోజురోజుకు ఇలా పెరుగుతున్నది? వ్యక్తులు, వ్యవస్థ దీనిగురించి ఆలోచించి బెంగళూరు సంఘటన తర్వాత మరొక్క మనిషి కూడా ఇలా అసహజ మరణానికి గురికాకుండా చూడాల్సిన అవసరం ఉన్నది. బెంగళూరు విషాదంలో మరణించినవారిలో 13 ఏళ్ల బాలిక తప్ప అంతా 19 నుంచి 23 ఏళ్ల మధ్య వయసు వాళ్లే. ఒక్కరు మాత్రమే 35 సంవత్సరాల వ్యక్తి. వీరంతా తమ కుటుంబాలకు విషాదం మిగిల్చి తరలిపోయారు. వీరంతా నిరుపేద కుటుంబాలకు చెందినవాళ్లే. రోజు కూలి చేసుకునే, పానీ పూరి అమ్ముకొని జీవించే, కష్టం చేసుకుని బతికే తమ తల్లిదండ్రులకు మంచి జీవితం ఇవ్వడం కోసం ఉన్నత చదువులు చదువుకుంటున్నవాళ్లు. ఇప్పుడా కుటుంబాలకు దిక్కెవరు?
పోనీ, అదేమీ భారతజట్టు ప్రపంచ కప్ గెలుచుకొచ్చిన సందర్భం కాదు. అది ప్రజలకు ఉచితంగా వినోదాన్ని అందించే క్రీడగా కూడా లేదు. అదొక వ్యాపారం. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అనే ఒక ఫ్రాంచైజీ టీం.

డబ్బుగలవారు ఇటువంటి టీంలను కొనుక్కుని ఆడించి మరింత డబ్బు, పలుకుబడి సంపాదించుకునే ఆట. ఆ జట్టు బెంగళూరు తరఫున ఆడి గెలిచింది కాబట్టి బెంగళూరులో సంబరాలు చేసుకున్నారు అనుకోవచ్చు. జట్టు గెలిచిన రోజు రాత్రి హైదరాబాద్ నగరంలో సచివాలయం ఎదుట నెక్లెస్ రోడ్‌లో జరిగిన ఉన్మాద ప్రదర్శనను ఎలా చూడాలి? ఇది దురభిమానానికి పరాకాష్ఠ. అక్కడ మెట్రో రైల్ బ్రిడ్జి కింద క్రికెట్ అభిమానులు బాణాసంచా కాల్చి జనం మీదకు తిప్పుతూ తమ ఉన్మాదాన్ని ప్రదర్శించారు. ఆ గెలిచింది హైదరాబాద్ జట్టు కాదు, అందులో ఒక్క హైదరాబాద్ ఆటగాడైనా లేడు. అటువంటప్పుడు హైదరాబాద్‌లో ఎందుకీ ఉన్మాద ప్రదర్శన? క్రికెట్ అనే క్రీడకు అభిమానులు ఎక్కడైనా ఉంటారు. ఇది ప్రపంచ స్థాయి క్రీడ అనుకుంటే దానిపట్ల రోజురోజుకూ పెరుగుతున్న దురభిమానం ఉన్మాదస్థాయికి చేరుకోవడం చూస్తున్నాం.

బెంగళూరు సంఘటననే తీసుకుంటే విజయోత్సవం ఏర్పాటుచేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు యాజమాన్యం, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ మాత్రమే ఈ దుర్ఘటనకు బాధ్యత వహించాలా? రాష్ట్ర ప్రభుత్వానికి, దాని అధీనంలో పనిచేసే పోలీసు వ్యవస్థకు ఏం సంబంధం లేదా? నిర్వాహకులు పోలీసుల నుంచి అనుమతి తీసుకున్నా, తీసుకోకపోయినా ఆ కార్యక్రమం జరగబోతున్నట్టుగా ముందుగానే ప్రకటించి ఉన్నారు. అంతేకాకుండా ఉచిత ప్రవేశం అనే ప్రచారం కూడా జరిగిన కారణంగా అభిమానులు పెద్దసంఖ్యలో గుమికూడబోతున్నారని పోలీస్ శాఖ ఊహించకపోవడం, కట్టుదిట్టమైన చర్యల కోసం తగిన బలగాలను అక్కడ మోహరించకపోవడం కచ్చితంగా పోలీస్ శాఖ వైఫల్యం కిందకే వస్తుంది. ఇటువంటి సంఘటనలు మామూలే అన్నట్టుగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు గతంలో ఇంకెక్కడో తమ వైరిపక్షాలు అధికారంలో ఉన్నచోట జరిగిన సంఘటనలను ఉదహరించడం సబబు కాదు.

దీనికి సంబంధించి హైదరాబాదులో ఆ రాత్రి జరిగిన సంఘటన మీద నగర కొత్వాల్ సివి ఆనంద్ చేసిన ఒక ట్వీట్‌కు స్పందిస్తూ ఒక పౌరుడు ఇలా ముందు సమాచారం లేకుండా వీధిలోకి వచ్చి జనానికి ఇబ్బంది కలిగించే మూకలను వీడియోలలో గుర్తించి వారి మీద సంబంధిత సెక్షన్లకింద కేసులు నమోదు చేయవచ్చునని సూచించారు. క్రికెట్ అభిమానులే కాదు, వివిధ సందర్భాల్లో ఇలా వేళ కాని వేళలో, ఎటువంటి భద్రతా చర్యలకు అవకాశం లేని విధంగా జనానికి ఇబ్బందులు కలిగించే వారి మీద కనీస చర్యలు ఉంటే తప్ప ఇటువంటి వారి కట్టడం సాధ్యం కాదు. పరిపాలన వ్యవస్థ.. ముఖ్యంగా పోలీస్ శాఖ ఈ దిశగా ఆలోచన చేస్తే భవిష్యత్తులో మరిన్ని సంఘటనలు జరగకుండా, మరికొంతమంది అమాయకంగా ప్రాణాలు పోగొట్టుకోకుండా చూసినవాళ్ళు అవుతారు.

భక్తులు, అభిమానులు, కార్యకర్తలు కూడా సీరియస్‌గా ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది. నాయకులు, మతగురువులు, సినిమాస్టార్లు, క్రికెట్ హీరోలు బాగానే ఉంటారు, హద్దులు మీరిన అభిమానం ప్రదర్శించడంవల్ల వ్యక్తిగతంగా నష్టపోయేది అభిమానులే. హైదరాబాదులోని సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన సంఘటన తదనంతర పరిణామాలు ఇందుకు మంచి ఉదాహరణ. ఆనాటి తొక్కిసలాటకు కారణం అయిన నటుడిమీద పోలీసులు కేసు పెట్టి ఒకటి రెండు రోజులు హడావిడి చేసినా ఆ తర్వాత అందరూ ఆ విషయాన్ని మర్చిపోయారు. అంతేకాదు, అదే పోలీసు వ్యవస్థ మీద అజమాయిషీ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సినిమా అవార్డుల కమిటీ ఆ నటుడిని అదే సినిమాకు ఉత్తమ నటుడి అవార్డుకు ఎంపిక చేసింది. ప్రాణం పోగొట్టుకున్నది అభిమాని, అవార్డు గెలుచుకున్నది అందుకు కారకుడైన నటుడు. ఇదీ పరిస్థితి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News