న్యూఢిల్లీ: ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకే ఆపరేషన్ సిందూర్ నిర్వహించినట్లు డిజిఎంఓ రాజీవ్ ఘాయ్ తెలిపారు. ఆదివారం ఆర్మీ, ఎయిర్ఫోర్స్, నేవీ సంయుక్త మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాజీవ్ ఘాయ్ మాట్లాడుతూ.. పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబసభ్యుల ఆవేదనను దేశం మొత్తం చూసిందని.. ప్రతీకారంగా ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేశామని చెప్పారు. ఉగ్రవాద శిబిరాలను మాత్రమే టార్గెట్ చేశామని.. అజ్మల్ కసబ్, డేవిడ్ హెడ్లీ లాంటివారికి శిక్షణ ఇచ్చిన ప్రాంతాలపై దాడి చేశామని తెలిపారు.
“ఉగ్రవాద శిబిరాలపై దాడిని వీడియో తీసి విడుదల చేశాం. 9 ఉగ్రవాద శిబిరాల్లో వంద మందికిపైగా ఉగ్రవాదులు చనిపోయారు. పాకిస్తాన్ మాత్రం సామాన్యులు, ప్రార్థనా స్థలాలు, స్కూళ్లను టార్గెట్ చేసింది. నిన్న పాక్ డిజిఎంఓ నాతో మాట్లాడి కాల్పుల విరమణకు ప్రతిపాదించారు. కాల్పుల విరమణ అంగీకారం కుదిరాక కూడా నిన్న రాత్రి పాక్ ఉల్లంఘనలకు పాల్పడింది. దానిపై పాక్ డిజిఎంఓ వివరణ అడిగాం.. మరోసారి కాల్పుల విరమణను ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇవాళ కనుక పాక్ దాడులకు దిగితే.. వాటిని ఎదుర్కొనేందుకు ఫ్రీహ్యాండ్ ఇచ్చారు” అని రాజీవ్ ఘాయ్ తెలిపారు.