పూంచ్ సెక్టార్లో పాక్ ఆర్మీ బాంబుల వర్షం కురిపించడంతో సిక్కు, ముస్లిం వ్యక్తులతోసహా మొత్తం 12 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో గురుద్వారా, మసీదు, గీతాభవన్ కూడా దెబ్బతిన్నాయి. దీంతో ఆ ప్రాంతాల ప్రజలు భయాందోళనలతో అక్కడ నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ఈ దాడిపై శ్రీ గురుసింగ్ సభ గురుద్వారాకు చెందిన జిల్లా గురుద్వారా ప్రబంధక్ కమిటీ అధ్యక్షుడు నరీందర్సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక బాంబు గీతాభవన్ను, మరొకటి మసీదును ధ్వంసం చేశాయని, మసీదులోని ఒక ఉపాధ్యాయుడు చనిపోయారని చెప్పారు. పౌరుల ప్రాణాలను లక్షంగా పెట్టుకుని బాంబుల దాడి చేయడం పాకిస్థాన్కు బుద్ధిలేని పని అని తీవ్రంగా విమర్శించారు. “ ఇది చాలా బాధాకరమైన విషాదం. సీమాంతర బాంబు దాడులకు పూంచ్ జిల్లాలో దాదాపు 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో సిక్కు సమాజానికి చెందిన ఐదుగురు, మిగిలినవారు ముస్లిం సమాజానికి చెందినవారు ఉన్నారు.
గురుద్వారా శ్రీ గురుసింగ్ సభ తాలూకు ఒకమూల భాగం బాగా దెబ్బతింది. తలుపు, అద్దాలు ధ్వంసం అయ్యాయి. గురుద్వారాకు తీవ్ర నష్టం ఏర్పడిందని వార్తలు వస్తున్నాయి. కానీ అవి నిజం కావు. ఇది బాగా ఇరుకైన రద్దీ ప్రాంతం కావడంతో ఒక బాంబు వచ్చి గీతాభవన్ను, మరోబాంబు మసీదును ఢీకొన్నాయి. మసీదులో ఒక ఉపాధ్యాయుడు చనిపోయాడు ” అని నరీందర్ సింగ్ వెల్లడించారు. పూంచ్ లోని వవిత్రమైన సెంట్రల్ గురుద్వారా శ్రీ గురుసింగ్ సభ సాహిబ్పై పాకిస్థాన్ అమానవీయ దాడి చేసిందని శిరోమణి అకాలీదళ్ నాయకుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ తీవ్రంగా ధ్వజమెత్తారు. మృతులు అమ్రిక్ సింగ్జీ, భాయి అమర్జీత్ సింగ్, రంజిత్సింగ్గా బాదల్ కార్యాలయం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు శిరోమణి అకాలీదల్ నాయకుడు సంతాపం వెలిబుచ్చారు. ఈ విషాద సమయంలో వారికి తగిన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.