పాట్నా: బీహార్లో పిడుగుపాటు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. గత 24 గంటల్లో బీహార్లోని ఆరు జిల్లాల్లో పిడుగుపాటుకు 12 మంది ప్రాణాలు కోల్పోయారు. బక్సర్ జిల్లాలో నలుగురు, పశ్చిమ చంపారన్ లో ముగ్గురు, కతిహార్ లో ఇద్దరు మృతి చెందగా.. కైమూర్, లఖిసరై, సీతామర్హి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారని రాష్ట్ర ప్రభుత్వం ధృవీకరించింది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా మృతుల బంధువులకు ఒక్కొక్కరికి రూ. 4 లక్షల ఎక్స్గ్రేషియా పరిహారం అందించాలని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అధికారులను ఆదేశించారు.
కాగా, వర్షాకాలం ఈ ప్రాంతాల్లో అనూహ్య వాతావరణ మార్పులు చోటుచేసుకుంటాయని అధికారులు తెలిపారు. ఉరుములతో కూడిన వర్షాలు పడే సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, భద్రతా సలహాలను పాటించాలని అధికారులు కోరారు. ప్రభుత్వం కూడా పరిస్థితిని చురుగ్గా పర్యవేక్షిస్తోందని.. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయం అందిస్తోందని అధికారులు పేర్కొన్నారు.