ఇజ్రాయెల్ వారం రోజులుగా ఇరాన్పై జరుపుతున్న దాడులలో ఇరాన్కు చెందిన కనీసం 14 మంది అణు శాస్త్రవేత్తలు మృతి చెందారు. ఇరాన్ నిర్ణీత లక్షాలను ఎంచుకుని ఇజ్రాయెల్ తన ఆపరేషన్ రైజింగ్ లయన్ చేపట్టింది. ఇరాన్లోని అణ్వాయుధ కార్యక్రమాన్ని దెబ్బతీసేందుకు, సైనిక పాటవాన్ని బలహీనపర్చే రీతిలో ఇజ్రాయెల్ దాడులు సాగుతూ వస్తున్నాయి. ప్రత్యేకించి ఈ క్రమంలో ఇరాన్కు చెందిన అణు విషయాల నిపుణులను హతమార్చడం ఇజ్రాయెల్ వ్యూహాత్మక చర్య అయింది.ఇజ్రాయెల్ దాడుల్లో హతులైన వారిలో ఇరాన్కు చెందిన ప్రఖ్యాత భౌతికశాస్త్రవేత్త , ఇరాన్ ఇస్లామిక్ ఆజాద్ వర్శిటీ ప్రముఖుడు అయిన మహమ్మద్ మెహిది తెహ్రాంచి , న్యూక్లియర్ ఇంజనీరు ఫెరిడౌన్ అబ్బాసీ దవాని వంటి వారు ఉన్నారు. ఈ ఇద్దరు కూడా ఇరాన్లో కీలక అణు కార్యక్రమాల రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. మృతి చెందిన వారిలో ఒక్కరైన అబ్బాసీ దవాని ఇరాన్ అణు ఇంధన సంస్థకు సారధ్యం వహిస్తున్నారు.
ఇజ్రాయెల్ దాడుల క్రమంలోనే వీరు చనిపోలేదని, వారిని లక్షంగా చేసుకునే దాడులు జరిగాయని వెల్లడైంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రమాదకర అణు శకం , సంబంధిత యుద్ధాల తరువాత పలు చోట్ల సైంటిస్టులను చంపివేయడం ప్రధాన అంశం అయిందని రాజకీయ శాస్త్ర నిపుణులు రాస్తున్న పుస్తకం ద్వారా స్పష్టం అయింది. 1944 నుంచి ఇప్పటివరకూ అణు శాస్త్రవేత్తల ఏరివేత గురించి వీరు పూర్తి సమాచారం రాబట్టుకున్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకూ వంద మంది వరకూ అణు శాస్త్రజ్ఞులపై దాడులు జరిగాయి. వీరిలో కొందరు చనిపోగా, పలువురు గాయపడ్డారు. ఇక మరికొందరు ప్రయోగాల దశలోనో లేక అనంతరమో కన్పించకుండా పొయ్యారు. వీరి అదృశ్యం ఇప్పటికీ మిస్టరీగానే మారింది. కొన్ని ప్రాంతాలలో అధికారిక వ్యవస్థలే అణు శాస్త్రజ్ఞులు, నిపుణులను రహస్యాలు లీక్ కాకుండా చేసేందుకు తుదముట్టిస్తున్నారని కూడా నిర్థారణ అయింది. ఇజ్రాయెల్ తాను బహిరంగంగా ప్రకటించి ఇరాన్ అణు స్థావరాలపై దాడికి దిగడం ,
పైగా అక్కడున్న అణు శాస్త్రవేత్తల అంతం తరువాత ఈ విషయాన్ని పదేపదే ప్రస్తావించడం మేధో ప్రతిభ , ఆవిష్కరణల ప్రక్రియకు, సంబంధిత వర్గీయులకు చేటు తెచ్చిపెట్టిందని వ్యాఖ్యానించారు. అణ్వాయుధ వ్యాప్తి నిరోధక చర్యలు, తమ పొరుగుదేశాల అణు కార్యక్రమాల నిరోధక చర్యలలో భాగంగానే దాడులు సాగుతున్నాయి. రాజకీయ భౌగోళిక ఇతరత్రా కక్షలు చివరికి అణు శాస్త్రవేత్తల ప్రాణాలు పోవడానికి దారితీస్తోందని పుస్తక రచయితలు తెలిపారు. అయితే వ్యక్తుల అంతంతో సంబంధిత దేశాల అణ్వాయుధ వ్యాప్తి, అణు కార్యక్రమాలకు కళ్లెం పడుతుందని అనుకోరాదని ఆందోళన వ్యక్తం అయింది. అణు శాస్త్రవేత్తలను ఏరిపారేసే వ్యూహాలకు ఎక్కువగా అమెరికా, ఇజ్రాయెల్ పాల్పడుతున్నాయి. ఇక బ్రిటన్, రష్యా ప్రత్యేకించి పుతిన్ హయాంలో ఈ విధమైన దాడులు ఎక్కువగా సాగుతున్నాయి.
ఇతర దేశాలు అణ్వాయుధ పాటవం సంతరించుకుంటాయనే అనుమానాలతోనే ఎక్కువగా ఇటువంటి సైనిక చర్యలకు పాల్పడుతున్నారు. సైంటిస్టుల అర్థాంతర ముగింపు కేవలం తదుపరి పరిశోధనలు నిలిచిపోవడానికి దారితీస్తోంది. అయితే ఈ క్రమంలో ఇప్పటికే రూపొందిన పలు అణు సంబంధిత ఉత్పత్తుల కీలక రహస్యాలు, అవి పనిచేయకుండా చేసే ఆయువుపట్లు ఎప్పటికీ ఇతరులు ఛేదించలేని దశలోనే ఉంటాయి. ఇది మానవాళికి పలు రకాలుగా ముప్పు తెచ్చిపెడుతోంది.