Friday, June 6, 2025

విజయోత్సవంలో అపశ్రుతి

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్‌లో విజేతగా నిలిచిన
ఆర్‌సిబి జట్టు సన్మాన కార్యక్రమంలో
విషాదం బెంగళూరు చిన్నస్వామి
స్టేడియంలో తొక్కిసలాట
న్యాయవిచారణకు ఆదేశించిన
కర్నాటక సిఎం సిద్ధరామయ్య
మృతుల కుటుంబాలకు రూ.10లక్షల
ఎక్స్‌గ్రేషియా 35వేల మంది
సామర్థం ఉన్న స్టేడియంలోకి
2లక్షల మంది అభిమానుల రాక
గేట్లు బద్ధలుకొట్టుకొని దూసుకొచ్చిన
అభిమానులు లాఠీఛార్జి,
తొక్కిసలాట బౌరింగ్, వైదేహి
ఆసుపత్రులకు క్షతగాత్రుల
తరలింపు ఆసుపత్రులకు వెళ్లి
బాధితులను పరామర్శించిన
ఆ రాష్ట్ర సిఎం, డిప్యూటీ సిఎం
తొక్కిసలాటపై రాష్ట్రపతి దిగ్భ్రాంతి
హృదయ విదారక ఘటన : ప్రధాని

బెంగళూరు: క్రికెట్‌లో రాయల్ ఛాలెంజ్ బెంగళూరు (ఆర్సీబీ) విజయోత్సవ వేడుక 11 మంది ప్రాణాలను బలిగొంది. 50 మందికి గాయాలు అయ్యాయి. వీరిలో ఆరుగురు పరిస్థితి విషమంగా ఉంది. స్థానిక ప్రఖ్యాత చిన్నస్వామి స్టేడియంలో ఈ దారుణ ఘటన జరిగింది. మృతులలో ఆరుగురు పురుషులు, నలుగురు మహిళలు ఉన్నారు. ఐపిఎల్‌లో కర్నాటకకు చెందిన ఆర్‌సిబి జట్టు విజయం సాధించడంతో కర్నాటక రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యపు కర్నాటక క్రికెట్ అసోసియేషన్ (కెసిఎ) బుధవారం పెద్ద ఎత్తున విజయోత్సవ సభ ఏర్పాటు చేసింది. ఎందరో రాజకీయ నేతలు, సినీ దిగ్గజాలు, పలు రంగాలకు చెందిన వారు, వేలాదిగా తరలివచ్చిన ఈ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి, ఊపిరాడని స్థితిలో 11 మంది దుర్మరణం చెందారు. కార్యక్రమం ఇక్కడి విధాన్ సౌథ ఆవరణలో ఏర్పాటు అయింది.

18 సంవత్సరాల నిరీక్షణ తరువాత ఈ ఐపిఎల్‌లో ఈ జట్టుకు తొలిసారి ఈ విజయం దక్కింది. దీనితో కాంగ్రెస్ ప్రభుత్వం భారీ స్థాయిలో విజయోత్సవ సభ ఏర్పాటు చేసింది. కన్నడ భాషాభిమానం పొంగిపొర్లే కర్నాటకలో ఈ సభకు వేలాదిగా జనం తరలివచ్చారు. అయితే సరైన ఏర్పాట్లు లేకపోవడం, జనం అత్యుత్సాహంతో పరిస్థితి అదుపు తప్పి, తొక్కిసలాటకు దారితీసిందని వెల్లడైంది. క్రీడాభిమానులు ఒక్కసారి ముందుకు వెళ్లడంతో తొక్కిసలాటకు దారితీసింది. స్టేడియం ప్రవేశ ద్వారాల వద్ద జనం కేరింతలు చివరికి తొక్కిసలాటతో జనం గావుకేకల హాహాకారాల మధ్య విషాదానికి దారితీశాయి. తమ క్రికెట్ వీరులను దగ్గరి నుంచి చూడాలనే వెర్రితనం చివరికి వారి ప్రాణాల మీదికి తీసుకువచ్చింది. ఓ వైపు ఉత్సవం ముందు స్టేడియం బయట వేచి ఉన్న జనం అంతకంతకూ పెరిగిపోతూ ఉండటంతో వారిని అదుపు చేసేందుకు బెంగళూరు పోలీసు బృందాలు కష్టపడాల్సి వచ్చిం ది. ఓ దశలో వారిపై లాఠీఛార్జీకి కూడా దిగారు.

ఆర్‌సిబి గెలుపు ట్రోఫీతో జట్టు బెంగళూరుకు వచ్చింది. ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ ఇతరులు విమానాశ్రయానికి వెళ్లి జట్టుకు స్వాగతం పలికారు. విరాట్ కోహ్లీ, కృనాల్ పాండ్య, టీమ్ డేవిడ్, దినేశ్ కార్తిక్‌కు ఆయన పుష్పగుచ్ఛాలు అందించి బెంగళూరుకు స్వాగతం పలికారు. క్రికెట్ ఎరుపు రంగు ఆర్‌సిబి జెండాలు పట్టుకుని తరలివచ్చారు. దీనితో విధాన్ సౌథ పరిసర ప్రాంతం అంతా ఎరుపు రంగుతో నిండింది. క్రికెట్ హీరోలను చూసేందుకు జనం గేట్లు , చెట్లు ఎక్కడంతో ఏం జరుగుతుందో తెలియని స్థితి ఏర్పడింది. గేట్ 2 నుంచి జనం లోపలికి వెళ్లడానికి యత్నించిన చేష్టలతో తొక్కిసలాట జరిగింది.మంగళవారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఈ ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్‌ను 7 విరుటకల తేడాతో ఓడించి కాలరేగరేసింది. ఆర్సీబీ ఈ విజయం సాధించడంతో మంగళవారం రాత్రి అంతా బెంగళూరులో సందడే సందడి వాతావరణం నెలకొంది. హోటల్స్‌లో వీధులలో సంబరాలు మిన్నంటాయి. కాగా బౌరింగ్ ఆస్పత్రిలో ఏడుగురు, వైదేహి ఆస్పత్రిలో నలుగురు మృతి చెందినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

ప్రధాని దిగ్భ్రాంతి
చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలియజేసిన ప్రధాని మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అంతేకాదు ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేల పరిహారం చెల్లిస్తామని ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News