మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలో బిసి కులాల జాబితా నుండి తొలగించబడిన 26 కులాలను తిరిగి చేర్చుకోవాలని వచ్చిన విజ్ఞప్తులపై తెలంగాణ బిసి కమిషన్ రెండవరోజు బహిరంగ విచారణ కొనసాగించింది. మంగళవారం జరిగిన బహిరంగ విచారణలో 56 ప్రతినిధి బృందాలను కమిషన్ విచారించింది. గవర, తూర్పుకాపు (గాజులకాపు), శెట్టిబలిజ, నాగవంశం, కొప్పుల వెలమ సంఘాల ప్రతినిధులు కమిషన్ ముందు హాజరై తమ కులాలను తెలంగాణ బిసి జాబితాలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఎంపి పాక వెంకట సత్యనారాయణ, కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్ శెట్టిబలిజ కులం తరపున మాట్లాడారు. మరోవైపు తెలంగాణ బిసి-ఎ గ్రూపునకు చెందిన పలు కులాల ప్రతినిధులు తొలగించబడిన 26 కులాలను తిరిగి చేర్చుకోవద్దని కమిషన్కు విజ్ఞప్తి చేశారు. ఈ బహిరంగ విచారణ కమిషన్ ఆఫీసులో బుధవారం కూడా కొనసాగుతుంది. బిసి కమిషన్ కార్యాలయంలో జరిగిన ఈ విచారణలో బిసి కమిషన్ ఛైర్మన్ జి. నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి రంగు, డిప్యూటి డైరెక్టర్ యు. శ్రీనివాసరావు, స్పెషల్ ఆఫీసర్ జి. సతీష్ కుమార్, రీసెర్చ్ ఆఫీసర్ జి. లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.