రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని దీంతో రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురుస్తాయని పేర్కొంది. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, కొమురంభీమ్ ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మేడ్చల్ మల్కాజ్గిరి, ములుగు, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట,
సూర్యాపేట, వరంగల్ తదితర జిల్లాల్లో అక్కడక్కడా వర్షం కురిసే అవకాశం ఉందని ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. బుధవారం ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, మంచిర్యాల, మేడ్చల్ మల్కాజ్గిరి, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సూర్యాపేట, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గురువారం తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.