Wednesday, June 25, 2025

ఎమర్జెన్సీకి 50 ఏళ్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత దేశచరిత్రలోనే చీకటి అధ్యాయంగా మిగిలిపోయిన ఆత్యయిక స్థితి (ఎమర్జెన్సీ) విధించి నేటితో( జూన్ 25) 50 ఏళ్లు పూర్తయ్యాయి.. సరిగ్గా యాభై ఏళ్ల క్రితం 1975 జూన్ 25వ తేదీన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ సిఫార్సు మేరకు నాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అహ్మద్ దేశంలో ఎమర్జెన్సీని విధిస్తున్నట్లు ప్రకటించారు. దేశంలో అశాంతి, అస్థిరతల కారణంగా ఎమర్జెన్సీని విధించినట్లు ప్రకటించినప్పటికీ వాస్తవానికి ఇందిరాగాంధీ అధికారంలో కొనసాగడం కోసం యావత్తు జాతి స్వేచ్ఛా స్వాతంత్య్రాలను కోల్పోయేలా చేసిన ఎమర్జెన్సీ దాదాపు 21 నెలల పాటు అంటే 1977 మార్చి21 దాకా కొనసాగింది.

ఎమర్జెనీ సమయంలో సామాన్య ప్రజలు తమ ప్రాథమిక హక్కులు కోల్పోయారు. రాజకీయ నాయకులు, ఆందోళనకారులు వేలాది మంది జైళ్ల పాలయ్యారు. పత్రికా ప్రపంచం సైతం స్వేచ్ఛగా పని చేయలేదు. ఇందిరాగాంధీ ఇష్టాలకు అనుగుణంగా నిబంధనలను మార్చి వేశారు. ఫలితంగా దేశ వ్యాప్తంగా ప్రజా ఆందోళనలు చెలరేగాయి. ఆందోళనలకు నాయకత్వం వహించిన జయప్రకాశ్ నారాయణ్, మొరార్జీ దేశాయ్, అటల్ బిహారీ వాజపేయి, ఎల్‌కె అద్వానీ, మధు దండావతే, జార్జి ఫెర్నాండెజ్ లాంటి పలువురు నేతలు జైలు పాలయ్యారు. ఇన్ని అనర్థాలకు కారణమైన ఎమర్జెన్సీ విధించడానికి దారితీసిన కారణాలేమిటో ఓ సారి గమనిద్దాం.

గుజరాత్ అల్లరు
ఇందిరాగాంధీ నిర్ణయాలకు వ్యతిరేకంగా 1973-75మధ్య కాలంలో దేశవ్యాప్తంగా అనేక ఆందోళనలు కొనసాగాయి. వీటిలో చెప్పుకోదగ్గది గుజరాత్‌లో సాగిన నవనిర్మాణ ఉద్యమం. విద్యాశాఖమంత్రికి వ్యతిరేకంగా మొదలైన విద్యార్థి ఉద్యమం చినికి చినికి గాలివానగా మారి చివరికి ప్రభుత్వాన్నే రద్దు చేసేలా చేసింది. అనాటి ముఖ్యమంత్రి చిమన్‌భాయ్ పటేల్ ప్రభుత్వాన్ని రద్దు చేసిన ఇందిరాగాంధీ రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన విధించారు.
బీహార్‌లో జెపి ఉద్యమం
బీహార్‌లో ముఖ్యమంత్రి అబ్దుల్ గఫూర్‌కు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఆందోళనల్లో ప్రముఖ గాంధేయ వాది, సేషలిస్టు నేత జయప్రకాశ్ నారాయణ్ పాలు పంచుకున్నారు. ఈ ఉద్యమం లాలూ ప్రసాద్ యాదవ్, నితీశ్ కుమార్ లాంటి తదుపరితరం నేతలను ఆకర్షించింది. సంపూర్ణ క్రాంతికి, ఇందిరాగాంధీని గద్దెదించాలని జయప్రకాశ్ నారాయణ్ పిలుపున్విడంతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది.

ఫెర్నాండెజ్ నేతృత్వంలో రైల్వే సమ్మె
దేశ చరిత్రలోనే మొట్టమొదటి పారి కార్మిక నాయకుడు జార్జి ఫెర్నాండెజ్ నేతృత్వంలో 1974లో భారీ ఎత్తున జరిగిన రైల్వే సమ్మెతో దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించి పోయింది. అదే సమయంలో రైల్వే మంత్రి, బీహార్ ఎంపి ఎల్‌ఎన్ మిశ్రా బాంబు దాడిలో హత్యకు గురికావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరిగిపోయాయి.
ఇందిరాగాంధీపై కేసు
అన్నిటికన్నా మించి 1971 పార్లమెంటు ఎన్నికల్లో రాయబరేలినుంచి ఇందిరాగాంధీ ఎన్నికను సవాలు చేస్తూ సోషలిస్టు నాయకుడు రాజ్ నారాయణ్ అలహాబాద్ హైకోర్టులో వేసిన కేసు ఎమర్జెన్సీకి దారితీసిన ప్రధాన కారణంగా చెప్పవచ్చు. 1975 జూన్ 15న జస్టిస్ జగ్‌మోహన్ లాల్ సిన్హా ఇందిరాగాంధీని దోషిగా నిర్ధారిస్తూ ఆమె ఎన్నికను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చారు. అదే రోజు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయి ఐదుపార్టీల ప్రతిపక్ష కూటమి విజయం సాధించింది.
అలహాబాద్ హైకోర్టు తీర్పును ఇందిరాగాంధీ సుప్రీంకోర్టులో సవాలు చేయగా, జూన్ 24న ఆ తీర్పుపైషరతులతో కూడిన స్టేసే విధిస్తూ ఇందిరాగాంధీ ప్రధానిగా కొనసాగవచ్చని, అయితే ఓటింగ్ హక్కులుండవని జస్టిస్ కృష్ణయ్యర్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు ఇచ్చింది. తీర్పు నేపథ్యంలో ఆ మరుసటి రోజు జయప్రకాశ్ నారాయణ్, మొరార్జీ దేశాయ్ నేతలు ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో భారీ ర్యాలీ నిర్వహించి ఇందిర ప్రభుత్వ రాజ్యాంగ వ్యతిరేక ఆదేశాలను పాటించవద్దంటూ పోలీసులు, సైన్యానికి పిలుపునిచ్చారు. అదే రోజు రాత్రి ఇందిరాగాంధీ, ఆమె కుమారుడు సంజయ్ గాఃధీ ఎమర్జెన్సీ విధించాలని నిర్ణయం తీసుకున్నారు. అర్ధరాత్రి సమయంలో రాష్ట్రపతి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అప్పటినుంచి 21 నెలల పాటు ఎమర్జెన్సీ కొనసాగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News