ఆదిలాబాద్: అకాల వర్షం కారణంగా ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏజెన్సీలోని గాదిగూడ మండలం పిప్పిరిలో 14 మంది వ్యవసాయ కూలీలతో కలిసి మొక్కజొన్న విత్తనాలు వేసే క్రమంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో వర్షం నుంచి రక్షణ కోసం పొలంలోనే ఉన్న కర్రలతో ఏర్పాటు చేసుకున్న గుడిసెలోకి అందరూ వెళ్లారు. అదే సమయంలో గుడిసెపై పిడుగు పడటంతో (Thunderstorm) పెందూర్ మాదర్రావు(45), సంజన(22), మంగం భీంబాయి(40), సిడాం రాంబాబు(45) అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో గాపడిన 10 మందిని తొలుత ఝురి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఆ తర్వాత రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
మరోవైపు జిల్లాలోని (Adilabad) బేల మండలం వేర్వేరు ప్రాంతాల్లో పడిన పిడుగుపాట్లకు (Thunderstorm) ఇద్దరు మహిళలు మృతి చెందారు. సాంగిడిలో పొలం పనులు చేస్తున్న నందిని (30), సోన్కాస్లో పత్తి విత్తనాలు వేస్తున్న సునీత(35)పై పిడుగు పడడటంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఉదయం నేల తల్లికి నమస్కారం చేసి పొలం పనులకు వెళ్లిన వారు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.