మానవతా సహాయక పంపిణీ కేంద్రంకు వెళుతున్న జనులపై మంగళవారం ఇజ్రాయెల్ దళాలు కాల్పులు జరిపి కనీసం 27 మందిని పొట్టనబెట్టుకుంది. మూడు రోజుల్లో ఇలాంటి ఘటన జరగడం ఇది మూడోది. ఇదిలావుండగా నిర్దేశించిన మార్గంలో కాకుండా వేరే మార్గంలో తమ దళాలను సమీపించిన, హెచ్చరిక కాల్పులను కూడా లెక్కచేయని ‘కొంత మంది అనుమానితులను’ లక్షంగా చేసుకుని కాల్పులు జరిపినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. గాజా దక్షిణ ప్రాంతంలోని సహాయ కేంద్రం వద్ద మానవతా సహాయ పంపిణీ కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఈ కాల్పులు జరిగాయి. రఫాలోని గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్(జిహెచ్ఎఫ్) మానవతా సహాయ పంపిణీ కేంద్ర సమీపంలో ఈ దాడులు జరిగాయి. కాగా ఆకలితో అలమటిస్తున్న పౌరులపై ఇజ్రాయెల్ దళాలు ఇలా దాడులు చేయడాన్ని హమాస్ తీవ్రంగా ఖండించింది. మంగళవారం ఉదయం జరిపిన కాల్పుల్లో కనీసం 27 మంది చనిపోయారని గాజా ఆరోగ్య మంత్రిత్వ రికార్డుల శాఖకు చెందిన జహెర్ అల్వహీది తెలిపారు.
రఫాలోని ఫీల్డ్ హాస్పిటల్లో ఇప్పటి వరకు 184 మంది గాయాలతో చేరారని, వారిలో 19 మంది ఆసుపత్రికి వచ్చేలోగా గాయాలతో చనిపోయారని, మరో ఎనిమిది మంది ఆసుపత్రికి వచ్చాక గాయాలతో చనిపోయారని రెడ్క్రాస్ అంతర్జాతీయ కమిటీ ప్రతినిధి హిషాం మ్హన్నా తెలిపారు. ఇక చనిపోయిన 27 మంది భౌతిక కాయాలని ఖాన్ యూనిస్లోని నాసర్ హాస్పిటల్కు తరలించారు. సహాయ పంపిణీ కేంద్రం వద్ద తమకు ఎలాంటి పంపిణీ జరగలేదని, అయితే ఏమీ పొందకుండానే తిరిగి వస్తుండగా ఇజ్రాయెల్ దళాలు తమపై నలువైపులా నుంచి కాల్పుల జరిపిందని రషా అల్నహల్ అనే ప్రత్యక్షసాక్షి తెలిపింది. ఇదిలావుండగా మరింత మంది ఇజ్రాయెలీ బందీలను విడుదల చేయడానికి హమాస్ ఒప్పుకోకపోవడంతో ఇజ్రాయెల్, హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంను మార్చిలో ఇజ్రాయెల్ తృణీకరించింది. ఇజ్రాయెల్ దాడుల్లో 2023 అక్టోబర్ 7 నుంచి ఇప్పటి వరకు 54వేల పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోయారు.