Tuesday, April 30, 2024

పట్టాలెక్కిన మెట్రో సర్వీసులు

- Advertisement -
- Advertisement -

Authorities reopened canceled Metro services

సికింద్రాబాద్ ఆందోళనలతో మధ్యాహ్నం మెట్రో రైళ్లు రద్దు
సాయంత్రం పరిస్దితులు సద్దుమణగడంతో సర్వీసులు పునరుద్దరణ
రైళ్ల బంద్‌తో సుమారు 10లక్షల నష్టం జరిగిదంటున్న మెట్రో సిబ్బంది
వాహనాలతో కిక్కిరిసిపోయిన నగర రహదారులు

మన తెలంగాణ, హైదరాబాద్ : మహానగరంలో సికింద్రాబాద్ ఆందోళన కారణంగా రద్దు అయిన మెట్రో సర్వీసులను అధికారులు సాయంత్రం ప్రారంభించారు. శుక్రవారం ఆరుగంటల పాటు మెట్రో రైలు నిలిపివేసి ఆందోళనకారులు మెట్రో స్టేషన్, పట్టాలపై రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. స్టేషన్ల సమీపంలోకి ఆందోళనకారులు రాకుండా సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేసి ఎలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. సాయంత్ర వరకు పరిస్దితులు సద్దుమణగడంతో 6.35 గంటలకు మెట్రో రైళ్లు పట్టాలపై ఎక్కించారు. మూడు కారిడార్ల పరిధిలో గతంలో నడిపించినట్లు ప్రయాణికుల రాకపోకలు సాగేలా చూశారు. దాదాపు 350 ట్రిప్పులు రద్దు అయినట్లు దీంతో మెట్రో సుమారు 10లక్షల వరకు నష్టం రావచ్చని మెట్రో సిబ్బంది వెల్లడించారు. మెట్రో రైళ్ల నిలిపివేత ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు.

దీనికి తోడు ఆర్టీసీ బస్సులు కూడా కొన్ని రద్దు చేయడంతో నగరవాసులు ఆటోలు, క్యాబ్‌లు వంటి ప్రైవేటు వాహనాలను ఆశ్రయించే పరిస్దితి ఏర్పడింది. మధ్యాహ్నం 1.30గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు రోడ్లలన్నీ రద్దీగా మారాయి. ట్రాఫిక్ జాం కావడంతో గంటల తరబడి రోడ్లపై ఉండే పరిస్దితి వచ్చిందని పలువురు వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు. అంబులెన్స్, దూరం ప్రాంతాలకు వెళ్లే పరిస్దితి మరింత దారుణంగా ఉంది. ప్రయాణికులు సమస్యలు గుర్తించి మెట్రో అధికారులు సాయంత్రం మెట్రో సర్వీసులు నడిపించారు. దీంతో ప్రయాణీకులు ఊపిరిపీల్చుకున్నారు. పటిష్టమైన బందోబస్తు మధ్య రైల్‌ను నడిపించారు. మెట్రో స్టేషన్ల వద్ద గుంపులుగా ఉండకుండా, స్దానిక పోలీసులు జాగ్రత్తలు తీసుకుని ప్రజలు మెట్రో రవాణాకు సహాకరించాలని సూచించారు. యువత ఆవేశాలకు వెల్లకుండా సహనం పాటించాలని, విధ్వంసం చేయడం సరికాదని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News